కట్టెలతో చితి ఏర్పాటు.. 29 ఏళ్ల ఈ యువతికి అంత్యక్రియలు చేయబోతుండగా సడన్‌గా ఊహించని పరిణామం..!

ABN , First Publish Date - 2021-11-18T22:27:17+05:30 IST

ఆ యువతి వయసు 29 ఏళ్లు.. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఆ మహిళకు పిల్లలు లేరు..

కట్టెలతో చితి ఏర్పాటు.. 29 ఏళ్ల ఈ యువతికి అంత్యక్రియలు చేయబోతుండగా సడన్‌గా ఊహించని పరిణామం..!

ఆ యువతి వయసు 29 ఏళ్లు.. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఆ మహిళకు పిల్లలు లేరు.. ఇటీవల ఆ యువతి అనుమానాస్పద రీతిలో మరణించింది.. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.. స్మశానంలో చితి పేర్చి నిప్పు అంటించేందుకు సిద్ధమవుతుండగా హఠాత్తుగా పోలీసులు రంగప్రవేశం చేశారు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.. ఆ యువతి అత్తింటి తరఫు వారిని అదుపులోకి తీసుకున్నారు.. బీహార్‌లోని నవాడా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


నవాడాకు చెందిన పింపి కుమారి అనే మహిళ ఎనిమిదేళ్ల క్రితం నితీష్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లై ఎనిమిదేళ్లైనా ఆమెకు పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం పింపి, నితీష్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో వారిద్దరి మధ్యా గొడవలు జరుగుతుండేవి. అత్తింటి వారు కూడా పింపి కుమారిని వేధించేవారు. అత్తింటి వేధింపులపై ఆమె గతంలో పంచాయితీలో కూడా ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం దక్కలేదు. పిల్లలు పుట్టరని తేలడంతో పంపిని అడ్డు తప్పించి మరో యువతిని పెళ్లి చేసుకోవాలని నితీష్ ప్లాన్ చేశాడు. అందుకు అతడి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. 


గత సోమవారం ఆమెను విపరీతంగా కొట్టారు. దీంతో ఆమె తీవ్ర గాయాల పాలై మరణించింది. ఆమెను స్మశానానికి తరలించి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న పింపి కుమారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నితీష్‌ను, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో అసలు విషయాన్ని రాబట్టారు. వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

Updated Date - 2021-11-18T22:27:17+05:30 IST