లాక్డౌన్లో అనాథగా మారిన పిల్లాడు.... ఆదుకున్న అధికారులు!
ABN , First Publish Date - 2020-05-25T12:13:41+05:30 IST
గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్డౌన్లో అవస్థలు పడుతున్న పేదలను అదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈనేపథ్యంలో పలు ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో కొనసాగుతున్న...
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్డౌన్లో అవస్థలు పడుతున్న పేదలను అదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈనేపథ్యంలో పలు ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో కొనసాగుతున్న లాక్డౌన్లో అనాథగా మారిన 12 ఏళ్ల చిన్నారిని అధికారులు ఆదుకున్న ఉదంతం ఆసక్తికరంగా ఉంది. లాక్డౌన్కు ముందు ఆ బాలుని తల్లిదండ్రులు ఢిల్లీ నుండి బీహార్లోని సమస్తిపూర్ వెళుతూ, ఆ చిన్నారిని బంధువుల ఇంట్లో ఉంచారు. ఇంతలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో తల్లిదండ్రులు బీహార్లో, పిల్లవాడు ఢిల్లీలో ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బంధువులు ఆ చిన్నారిని కొన్ని రోజుల పాటు చూసుకున్నాక బయట వదిలేశారు. దీంతో ఆ చిన్నారి ద్వారకప్రాంతంలోని ఒక పార్కులో ఉండసాగాడు. ఆ పార్కుకు వాకింగ్కు వెళ్లిన ఒక యువతి ఈ ఈ పిల్లవాడిని చూసి, ఒడిశాకు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి అరుణ్ బోత్రాకు ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. దీనిని చూసిన అరుణ్... పట్నా ఫ్రాంటియర్కు చెందిన ఐజి సంజయ్ కుమార్కు ఈ విషయం తెలియజేశారు. దీంతో ఇద్దరూ ఆ పిల్లవాడిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాలని నిర్ణయించుకున్నారు. బాలునికి సంబంధించిన సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు. అలాగే వారు ఢిల్లీకి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇండియా కేర్స్ వాలంటీర్లు ఆ తల్లిదండ్రులకు టిక్కెట్లు అందించి సహాయం చేశారు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ చిన్నారిని కలుసుకోగలిగారు.