HYD : దంపతులపై బంధువుల దాడి.. భార్యకు అబార్షన్
ABN , First Publish Date - 2021-12-17T16:54:03+05:30 IST
దంపతులపై బంధువుల దాడి.. భార్యకు అబార్షన్
హైదరాబాద్ సిటీ/సైదాబాద్ : పాత గొడవల నేపథ్యంలో భార్యాభర్తలపై బంధువులు దాడిచేసి గాయపర్చారు. పోలీసుల కథనం ప్రకారం సైదాబాద్ పూసలబస్తీకి చెందిన కావేటి వాణి, విద్యాభూషణ్లు భార్యాభర్తలు. వాణి సోదరుడు ఏడాదిన్నర క్రితం మేనమామ చెన్ని బాలకృష్ణ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పట్లో ఇరుకుటుంబాల మధ్య గొడవలు జరిగి దూరంగా ఉంటున్నారు. అయితే, ఆదివారం పూసలబస్తీలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద విద్యాభూషణ్ కూతురితో కలిసి ఉండగా చెన్ని బాలకృష్ణ దాడి చేశాడు. .
విషయం తెలుసుకున్న వాణి అక్కడికి రాగానే బాలకృష్ణ, అతడి కుటుంబసభ్యులు ఆమెపై మూకుమ్మడిగా దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. దాడి కారణంగా రెండు నెలల గర్భవతి అయిన తనకు అబార్షన్ జరిగినట్లు వాణి వాపోయింది. బాలకృష్ణపై చర్య తీసుకునేందుకు పోలీసులు జంకుతున్నారని ఆమె ఆరోపించింది. తనను చంపే ప్రయత్నం చేసిన అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.