ఉత్సవానికి పటిష్ట బందోబస్తు
ABN , First Publish Date - 2021-10-18T03:56:33+05:30 IST
తొలేళ్లు, సిరిమానోత్సవానికి జిల్లా పోలీసు శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది కూడా 2,500 మంది పోలీసులను కేటాయించింది. పార్కింగ్ స్థలాలకు వెళ్లేందుకు ఎక్కడికక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించనున్నారు.
2,500 మంది సిబ్బంది నియామకం
కెమెరాలు, డ్రోనలతో నిరంతర పర్యవేక్షణ
విజయనగరం(ఆంధ్రజ్యోతి), క్రైం, అక్టోబరు 17: తొలేళ్లు, సిరిమానోత్సవానికి జిల్లా పోలీసు శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది కూడా 2,500 మంది పోలీసులను కేటాయించింది. పార్కింగ్ స్థలాలకు వెళ్లేందుకు ఎక్కడికక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించనున్నారు. సిరిమాను తిరిగే రహదారితో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని అమ్మవారి దేవాలయానికి ఎదురుగా ఉన్న తాత్కాలిక కంట్రోల్ రూమ్లోని కమాండ్ కంట్రోల్తో అనుసంధానం చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని, అధికారులను కేటాయించారు. డ్రోన్ కెమెరాలతో పాటు, బాడీ కెమెరాలు సైతం సిద్ధం చేశారు.
సిరిమానోత్సవం పూర్తి అయ్యే సమయానికి చీకటి పడే అవకాశం ఉండడంతో ముఖ్యప్రాంతాల్లో పోలీసు శాఖ అస్కా లైట్లు ఏర్పాటు చేస్తోంది.. గత ఏడాది ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఈ ఏడాది కూడా ఇదే విధానాన్ని కొనసాగించనున్నారు.
ఈవ్టీజింగ్, అల్లరి మూకలు, ఆకతాయిలను నిరోధించేందుకు ప్రత్యేకంగా మహిళా రక్షక్ బృందాలు ఏర్పాటు చేశారు. వీరంతా ఆదివారం నుంచే రంగంలోకి దిగారు.
రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పిక్పాకెటింగ్, చైనస్నాచింగ్ జరిగే అవకాశం ఉన్నందున, వాటిని నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను మఫ్టీలో ఏర్పాటు చేశారు. వీరు ఇప్పటికే విధుల్లో ఉన్నారు.
ఎస్పీ దీపికాపాటిల్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఎస్పీ సత్యనారాయణరావు, ఓఎస్డీ సూర్యచంద్రరావుల పర్యవేక్షణలో విజయనగరం డీఎస్పీలు అనిల్కుమార్, మోహనరావు, శేషాద్రీ, పార్వతీపురం డీఎస్పీ సుభాష్, అధికారులు, సిబ్బంది అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడనున్నారు.
ఏఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు-11, సీఐ/ఆర్ఐలు-55, ఎస్ఐలు/ఆర్ఎస్ఐలు 136, హెచ్సీ/ఎఎస్ఐలు 414, పీసీలు-652, ఉమెన్ పీసీలు-144, హోంగార్డులు-365, ఎస్టీఎఫ్-165, ఏఆర్-165, పీఎస్ఓలు-25, బాంబు, డాగ్ స్క్వాడ్లు-10, కమ్యూనిటీ సిబ్బంది-25, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు-55 ఏర్పాటు చేస్తున్నారు.
ఫాల్క్న వాహనంతో నిఘా
పైడితల్లమ్మ జాతరను అత్యాధునిక కమాండ్ కంట్రోల్ వాహనంతో కూడా పోలీస్శాఖ పర్యవేక్షించనుంది. పోలీస్ ఫాల్క్న్ వాహనాన్ని ఇందుకోసం వినియోగిస్తోంది. సోమవారం నాటికి ఈ వాహనం జిల్లా కేంద్రానికి చేరుకోనుంది. సీఎం పర్యటనలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించి ఈ వాహనాన్ని పైడితల్లి జాతరలో వినియోగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, రాడార్ వ్యవస్థ కలిగిన ఈ వాహనంలో సుమారు 8 మంది వరకు టెక్నీషీయన్లు పనిచేస్తారు. 1.5 కిలోమీటర్ల దూరంలోని చిత్రాలను, వీడియోలను హై రెజుల్యూసన్తో చిత్రీకరించటం దీని ప్రత్యేకత.