వ్యాక్సినేషన్లో వెనుకడుగు
ABN , First Publish Date - 2021-10-06T04:10:38+05:30 IST
అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని కొవిడ్ వ్యాక్సినేషన్లో జోగుళాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచిన గద్వాల
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
4,66,280 మందికిగాను 2,54,251 మందికి మాత్రమే వ్యాక్సిన్
మొదటి డోస్ 42 శాతం, రెండో డోస్ 23 శాతం మాత్రమే పూర్తి
గద్వాల క్రైం, సెప్టెంబరు 5: అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని కొవిడ్ వ్యాక్సినేషన్లో జోగుళాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో నారాయణపేట జిల్లా మొదటి డోస్ 58 శాతం, రెండో డోస్ 14 శాతం పూర్తి చేసుకుని 19వ స్థానంలో నిలిచింది. మహబూబ్నగర్ జిల్లా మొదటి డోస్ 52 శాతం, రెండో డోస్ 33 శాతంతో 25వ స్థానంలో, వనపర్తి మొదటి డోస్ 52 శాతం, రెండో డోస్ 26 శాతంతో 27వ స్థానంలో, నాగర్కర్నూల్ మొదటి డోస్ 48 శాతం, రెండో డోస్ 27 శాతంతో 31వ స్థానంలో, ఇక జోగుళాంబ గద్వాల జిల్లా మొదటి డోస్ 42 శాతం, రెండో డోస్ 23 శాతంతో 33వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు.
2,54,251 మందికి మాత్రమే వ్యాక్సిన్
జోగుళాంబ గద్వాల జిల్లాలో 4,66,280 మంది 18 సంవత్సరాలు పూర్తి అయిన వారు ఉండగా మొదటి డోస్ 2,19,006 మంది, రెండో డోస్ 45,515 మంది మాత్రమే వేయించుకున్నారు. ఇంకా 2,47,274 మంది వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. గత నెల 30 వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల లక్ష్యం చేరుకోలేకపోయారు.
ధరూర్, గట్టులో వెనుకబాటు
జోగుళాంబ గద్వాల జిల్లా కొవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉంది. వ్యాక్సినేషన్ వేయడంలో జిల్లాలోని గట్టు, ధరూర్ మండలాలు వెనుకబడి ఉన్నాయి. అందుకు అక్కడ చదువుకున్న వారు తక్కువగా ఉండటం, అవగాహన రాహిత్యం ప్రధాన కారణాలు. అయినప్పటికీ త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యేలా చూస్తాం.
- డాక్టర్ శశికళ, ప్రోగ్రాం అధికారి, గద్వాల.