రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి: కేబినెట్ సబ్ కమిటీ

ABN , First Publish Date - 2021-06-30T00:06:23+05:30 IST

తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్

రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి: కేబినెట్ సబ్ కమిటీ

హైదరాబాద్: తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ  అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,  స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి , వివిధ శాఖ అధిపతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి  భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరిగాయని కమిటీ పేర్కొంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ విలువలను ప్రభుత్వం పెంచలేదు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎనిమిది సంవత్సరాల్లో ఏడుసార్లు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగినట్టు కమిటీ గుర్తించింది.  




ప్రస్తుతం ఆంధ్రాలో 7 శాతం, తమిళనాడులో 7.5 శాతం, మహారాష్ట్రలో 7 శాతంగా రిజిస్ట్రేషన్ విలువలు ఉన్నాయని కమిటీ తెలిపింది.  నిర్ధారిత ప్రభుత్వ విలువల కన్నా ఎక్కువకే లక్షలాది రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతున్నాయని కమిటీ పేర్కొంది. హెచ్ఎండీఏ పరిధిలో 2019-20 సంవత్సరంలో ప్రభుత్వ విలువల కన్నా అధిక విలువతో 51 శాతం  రిజిస్ట్రేషన్ల  నమోదు జరిగిందని కమిటీ తెలిపింది. మార్కెట్ విలువ కన్నా చాలా తక్కువగా రిజిస్ట్రేషన్ విలువ ఉండడం వలన బ్యాంకు రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కమిటీ పేర్కొంది.


ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు భారీగా విలువ పెరిగిందిన కమిటీ అభిప్రాయపడింది. అభివృద్ధి కార్యక్రమాలతో  రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలు తరలివచ్చినట్టు కమిటీ తెలిపింది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, నగర విస్తరణ వలన హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తులు/ భూముల విలువ భారీగా పెరిగినట్లు  కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. 

Updated Date - 2021-06-30T00:06:23+05:30 IST