ప్రజల ప్రయోజనం కోసమే ఆస్తుల నమోదు
ABN , First Publish Date - 2020-09-30T06:17:36+05:30 IST
పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు తమ ఆస్తులపై ఉన్న హక్కులను పరిరక్షించేందుకే ఆస్తుల నమోదు
ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు తమ ఆస్తులపై ఉన్న హక్కులను పరిరక్షించేందుకే ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో మంగళవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బల్దియాల్లో నివసించే పేద, అతిపేద వర్గాల స్థలాలు, ఇళ్ల సమస్యలకు పూర్తి పరిష్కారం ఈ ప్రక్రియతో సాధ్యమవుతుందని వివరించారు. వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ పట్టాలందిస్తామని, దీంతో వారి ఆస్తులకు హక్కులు వర్తిస్తాయని, తద్వారా రుణాలు పొందేందుకు, విక్రయించుకునేందుకు సౌలభ్యం కలుగుతుందని చెప్పారు. వివాదాస్పద భూములకు సంబంధించి కలెక్టర్ నేతృత్వంలో విచారణ నిర్వహించి నిజమైన అర్హులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఆస్తుల నమోదు కోసం వచ్చే అధికారులకు పూర్తి సమాచారమివ్వాలని కోరారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక భూ తగాదాలు, వివాదాలకు పూర్తిస్థాయిలో ఫుల్స్టాప్ పడుతుందని సూచించారు. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ బల్దియాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మునిసిపల్ చైర్మన్లు కేసీ నరసింహులు, బస్వరాజ్గౌడ్, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ పాల్గొన్నారు.