గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు
ABN , First Publish Date - 2021-10-27T05:28:26+05:30 IST
ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసే విధానంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు గా లింగపాలెం మండలం పోతవరం గ్రామాన్ని ఎంపిక చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు తెలిపారు.
పైలెట్ ప్రాజెక్ట్గా పోతవరం ఎంపిక : జిల్లా రిజిస్ట్రార్
చింతలపూడి(లింగపాలెం), అక్టోబరు 26: ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసే విధానంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు గా లింగపాలెం మండలం పోతవరం గ్రామాన్ని ఎంపిక చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు తెలిపారు. రంగాపురం సచివాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సామగ్రిని, కార్యాలయాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. పోతవరం గ్రామం రంగాపురం సచివాలయ పరిధిలో ఉన్నందున ఈ కార్యాలయంలో కేవలం ఆ గ్రామంలో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. రిజిస్ర్టేషన్ విధానాన్ని పోతవరం గ్రామ కార్యదర్శి చేపడతారని రంగాపురం సచివాలయం సిబ్బంది నమో దు చేస్తారని తెలిపారు. చింతలపూడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శికి, సచివాలయ సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సబ్ రిజి స్ట్రార్ కార్యాలయం పరిధిలో ఒకటి రెండు గ్రామాలను ఈ విధంగా ఎంపిక చేసి ఆ కార్యదర్శి రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తారని, జిల్లాలో మరికొన్ని సచివాలయాలు ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఆయన వెంట చింతలపూడి సబ్ రిజిస్ట్రార్ శ్యామ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.