రాజన్న ఆలయానికి తగ్గిన రాబడి
ABN , First Publish Date - 2021-04-13T06:14:14+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆదాయంపై కరోనా ప్రభావం పడింది. గత రెండేళ్లతో పోలిస్తే గడిచిన ఆర్థిక సంవత్సరంలో రాజన్న రాబడి భారీగా తగ్గిపోయింది.
వేములవాడ, ఏప్రిల్ 12 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆదాయంపై కరోనా ప్రభావం పడింది. గత రెండేళ్లతో పోలిస్తే గడిచిన ఆర్థిక సంవత్సరంలో రాజన్న రాబడి భారీగా తగ్గిపోయింది. ఆలయ అధికారుల కథనం ప్రకారం.. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఆలయ ఖజానాకు 48 కోట్ల 55 లక్షల 74 వేల రూపాయల ఆదాయం సమకూరింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాజన్న ఆలయానికి రూ.60 కోట్ల 64 లక్షల ఆదాయం సమకూరగా, 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.85 కోట్ల 69 లక్షల ఆదాయం వచ్చింది. కరోనా వైరస్ నిబంధనల నేపథ్యంలో 2020 మార్చి 18వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపిశారు. దీంతో రాజన్న ఆలయ రాబడి రూ.48.55 కోట్లకు పడిపోయింది. ఈ సంవత్సరవం వచ్చిన రూ.48.55 కోట్లలో హుండీ ద్వారా 16.79 కోట్లు, కోడెమొక్కుల ద్వారా రూ.9.73 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.8 కోట్లు, లీజుల ద్వారా రూ.3 కోట్లు, ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా 4 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు.