తగ్గిన పింఛన్లు!
ABN , First Publish Date - 2021-08-01T05:51:48+05:30 IST
సామాజిక పింఛన్ల పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆగస్టు నెలకు సంబంధించి పింఛన్లు భారీగా తగ్గాయి. గత నెలతో పోలిస్తే 1,904 పింఛన్లు తగ్గిపోయాయి. పింఛన్ల ఏరివేత కారణంగా తగ్గిపోయాయన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా... మరణాలు, లబ్ధిదారులు ఇతర ప్రాంతాలకు వలసపోవడం తదితర కారణాల వల్లనే తగ్గాయని అధికారులు చెబుతున్నారు. చాలామంది అనర్హులు
తగ్గిన పింఛన్లు!
గత నెలతో పోల్చుకుంటే 1,904 తగ్గాయి
ఈకేవైసీయే కారణమని అనుమానం
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)
సామాజిక పింఛన్ల పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆగస్టు నెలకు సంబంధించి పింఛన్లు భారీగా తగ్గాయి. గత నెలతో పోలిస్తే 1,904 పింఛన్లు తగ్గిపోయాయి. పింఛన్ల ఏరివేత కారణంగా తగ్గిపోయాయన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా... మరణాలు, లబ్ధిదారులు ఇతర ప్రాంతాలకు వలసపోవడం తదితర కారణాల వల్లనే తగ్గాయని అధికారులు చెబుతున్నారు. చాలామంది అనర్హులు పింఛన్లు పొందుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈకేవైసీ (ఎలకా్ట్రనిక్ నో యువర్ కస్టమర్)ని గత నెల జిల్లావ్యాప్తంగా నిర్వహించింది. లబ్ధిదారుల వేలిముద్రలను సేకరించి ఈకేవైసీ చేయించారు. కొంతమంది వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో వారికి ఐరిస్ ద్వారా ఈకేవైసీ పూర్తిచేశారు. కేవలం లైవ్ పింఛన్లు ఎన్ని? మరణాలు ఎన్ని ఉన్నాయన్నది నిర్ధారణ కోసమే ఈకేవైసీ చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. ఆగస్టు నెలకు సంబంధించి ఏకంగా 1,904 పింఛన్లు తగ్గుముఖం పట్టడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తమకు పింఛన్ ఉంటుందా? లేదా? అన్న అనుమానం వారిని వెంటాడుతోంది.
గత నెలతో పోల్చితే..
గత నెలలో అన్నిరకాల పింఛన్లకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 3,45,935 మంది, అర్బన్ ప్రాంతాల్లో 32,939 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం 3,78,874 మంది ఫించన్లు పొందారు. రూ.90కోట్ల 62 లక్షల 54 వేలు అందించారు. ఆగస్టు నెలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 3,44,232 మంది, అర్బన్ ప్రాంతాల్లో 32,722 మందికి అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత నెలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో 1,703, అర్బన్ ప్రాంతాల్లో 217 పింఛన్లు తగ్గాయి. ప్రభుత్వం రూ.89 కోట్ల 51 లక్షల 71వేలు విడుదల చేసినట్టు చెబుతున్నారు. గత నెలకంటే రూ.1.10 కోట్లు తగ్గాయి. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు..పింఛన్ మంజూరు చేస్తామన్న అధికారుల ప్రకటన కార్యరూపం దాల్చలేదు. గడిచిన రెండు నెలల్లో సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న కొత్తవారికి పింఛన్లు మంజూరు కాలేదు. కిడ్నీ బాధితులకు సంబంధించి న పింఛన్లు మాత్రం కొత్తగా 18 మంజూరయ్యాయి.
ప్రతినెలా తగ్గుతుంటాయి
సాధారణంగా ప్రతినెలా పింఛన్లు తగ్గుతుంటాయి. లబ్ధిదారులు ఆందోళనపడాల్సిన పనిలేదు. లబ్ధిదారులు మరణించినా, ఇతర ప్రాంతాలకు వలసపోయినా తగ్గుతుంటాయి. ఆగస్టు నెలకు సంబంధించి 1,904 పింఛన్లు తగ్గిన మాట వాస్తవమే. ఆదివారం నుంచి పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం.
-శాంతిశ్రీ, డీఆర్డీఏ పీడీ, శ్రీకాకుళం