బ్యాంకుల్లో తగ్గిన బడా మోసాల కేసులు
ABN , First Publish Date - 2022-07-04T10:27:33+05:30 IST
బ్యాంకుల్లో రూ.100 కోట్లు అంతకు మించిన ఘరానా మోసాలు తగ్గుముఖం పట్టాయి.
అయినా రూ.41,000 కోట్లు హాంఫట్
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో రూ.100 కోట్లు అంతకు మించిన ఘరానా మోసాలు తగ్గుముఖం పట్టాయి. 2020-21లో ఇలాంటి కేసులు 265 నమోదైతే, 2021-22లో ఇవి 118కి పడిపోయాయి. దీంతో ఈ మోసాలతో ముడిపడిన రుణాల మొత్తం రూ.1.05 లక్షల కోట్ల నుంచి రూ.41,000 కోట్లకు దిగొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) ఈ మోసాల సంఖ్య 167 నుంచి 80కి పడిపోయింది. మోసపోయిన రుణాల మొత్తమూ రూ.65,900 కోట్ల నుంచి రూ.28,000 కోట్లకు దిగొచ్చింది. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ మోసాల సంఖ్య 98 నుంచి 38కి పడిపోయింది. దీంతో ఈ మోసాలతో ముడిపడిన మొత్తం కూడా రూ.39,900 కోట్ల నుంచి రూ.13,000 కోట్లకు దిగొచ్చింది. బ్యాంకుల్లో మోసాలను ముందే గుర్తించే వ్యవస్థను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పటిష్ఠం చేయడం అక్రమార్కులకు చాలా వరకు చెక్ పెడుతోంది.
అయినా పెద్ద మోసం
మోసగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ, బ్యాంకులు ఎన్ని పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని ఘరానా మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. దేశ బ్యాంకింగ్ చరిత్రలో నమోదైన అతి పెద్ద మోసాల్లో ఒకటైన రూ.22,842 కోట్ల ఏబీజీ షిప్యార్డు ఘరానా మోసం ఈ సంవత్సరమే బయట పడింది. ఎస్బీఐ ఫిర్యాదుతో ఈ కంపెనీ ప్రమోటర్లపై ప్రస్తుతం కేసు నడుస్తోంది.