అదుపుతప్పిన ‘ఎర్ర’దొంగల కారు.. ఇంటిని ఢీకొట్టగా భారీ శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా..!
ABN , First Publish Date - 2022-02-03T12:50:15+05:30 IST
ఎర్రచందనం తరలిస్తున్న ఓ కారు అతివేగంతో వెళ్తూ అదుపుతప్పి ఓ ఇంటిని ఢీకొంది.
- మహిళకు గాయాలు
- పరారైన ఇద్దరు స్మగ్లర్లు
చిత్తూరు జిల్లా/శ్రీకాళహస్తి : ఎర్రచందనం తరలిస్తున్న ఓ కారు అతివేగంతో వెళ్తూ అదుపుతప్పి ఓ ఇంటిని ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా, స్మగ్లర్లు వాహనం వదలి పరారయ్యారు. వివరాలివీ... ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఓ కారు బుధవారం ఉదయం తిరుపతి నుంచి పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారివైపు వచ్చింది. ఈ నేపథ్యంలో తొట్టంబేడు మండలం కన్నలి ఎస్టీకాలనీ వద్దకు రాగానే, వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఇంటిని ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శ్రీకాళహస్తి భాస్కరయ్య స్వల్పంగానూ, ఆయన భార్య రత్నమ్మ తీవ్రంగా గాయపడింది. భారీ శబ్ధం విన్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకునేలోపు కారులో ఇరుకున్న ఇద్దరు స్మగ్లర్లు అతికష్టంపై బయటికి వచ్చి పరారయ్యారు. అనంతరం గాయపడిన బాధితులను స్థానికులు చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎస్టీకాలనీ చేరుకుని, వాహనంతోపాటు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.