రెడ్క్రాస్ సేవలు భేష్ : కలెక్టర్
ABN , First Publish Date - 2020-06-04T09:14:01+05:30 IST
విశాఖ జిల్లాలో కోవిడ్ 19 నియంత్రణలో రెడ్క్రాస్ సేవలు భేష్ అని కలెక్టర్ వినయ్చంద్ కితాబు ఇచ్చారు.
మహారాణిపేట, జూన్ 3 : విశాఖ జిల్లాలో కోవిడ్ 19 నియంత్రణలో రెడ్క్రాస్ సేవలు భేష్ అని కలెక్టర్ వినయ్చంద్ కితాబు ఇచ్చారు. విభాగం సిబ్బంది అంతా అంకితభావంతో సేవలందించారని తెలిపారు. రెడ్క్రాస్ సేవలపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తోపాటు పలువురు రెడ్క్రాస్ ప్రతినిధులు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి ఆసరాలేక రోడ్డు పక్కన పడివున్న వారికి, రోజు కూలీలకు, ఉపాధి కోల్పోయిన పేదలకు లాక్డౌన్ కాలంలో నిత్యావసర సరుకులతోపాటు మంచినీరు, మాస్క్లు, శానిటైజర్లు అందించారని తెలిపారు.
గవర్నర్ కార్యాలయం సూచించిన విధంగా నర్సీపట్నంలోని ఒడిశా కార్మికులకు నెలరోజులకు సరిపడే సరుకులు పంపిణీ చేశారన్నారు. ఆరిలోవ రిఫరల్ ఆస్పత్రిలో 28 ప్రసవాల నిర్వహణ ఖర్చుతోపాటు బాలింతలకు భోజన వసతి కల్పించారని వివరించారు. మొత్తం 387 యూనిట్ల రక్తాన్ని బ్లడ్బ్యాంకుల ద్వారా అందించి రోగులను ఆదుకున్నారని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్లో విశాఖ రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎస్.కె.ఎల్.రావు, మురళీపట్నాయక్ పాల్గొన్నారు.