దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు
ABN , First Publish Date - 2021-10-27T04:13:17+05:30 IST
దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు
నవాబుపేట: మండలంలోని ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టి తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి, పగలు అనే తేడా లేకుండా గుట్టలు తవ్వి దర్జాగా విక్రయిస్తున్నారు. కేశవపల్లి చెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల నుంచి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మండలంలోని చిట్టిగిద్ద చౌరస్తా వద్ద ప్రభుత్వ భూమి నుంచి మట్టి తవ్వి దళారులు వాడుకుంటున్నారు. అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య, ఎంపీటీసీ ఎక్బాల్ తదితరులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తహసీల్దార్ బుచ్చయ్యకు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి తవ్వకాలను నిలిపివేయాలని, ఎర్రమట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, ప్రజలు కోరుతున్నారు.