తోతాపురికి రికార్డు ధర
ABN , First Publish Date - 2022-07-02T06:41:54+05:30 IST
తోతాపురి రకం మామిడి శుక్రవారం రికార్డు స్థాయి ధర పలికింది.
బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో టన్ను రూ.62 వేల నుంచి రూ.64 వేలు
బంగారుపాళ్యం, జూలై 1: గుజ్జు పరిశ్రమకు ఎక్కువగా అవసరమయ్యే తోతాపురి రకం మామిడి శుక్రవారం రికార్డు స్థాయి ధర పలికింది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో టన్ను రూ.62 వేల నుంచి రూ.64 వేల వరకు పలికింది. మార్కెట్ చరిత్రలో ఇలాంటి ధర పలకలేదని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. నీలం రకం మామిడి టన్ను నాణ్యత, పరిణామాన్ని బట్టి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ధర పలుకుతోంది. మరో పక్షం రోజుల్లో కోతలు పూర్తి కావస్తున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో మామిడి ధరలు అనూహ్యంగా పుంజుకున్నాయి. ప్రారంభంలో టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల ధరకు మాత్రమే అమ్ముకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మామిడి బోర్డు ఏర్పాటు చేసి, ధరలను స్థిరీకరిస్తే నష్టపోయే అవకాశం ఉండదని సూచిస్తున్నారు.