‘రికవరీ’లో రికార్డు
ABN , First Publish Date - 2020-09-19T07:21:43+05:30 IST
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నెలలో 11 రోజుల సగటు చూస్తే.. రోజుకు 70 వేల
దేశంలో 24 గంటల్లో 87,472 మంది
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నెలలో 11 రోజుల సగటు చూస్తే.. రోజుకు 70 వేల మందిపైనే కోలుకున్నారు. తాజాగా 24 గంటల్లో అత్యధికంగా 87,472 మంది రికవరీ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటిచింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల వ్యవధిలో 96,424 కేసులు నమోదయ్యాయని, 1,174 మంది చనిపోయారని తెలిపింది. మరోవైపు ఇప్పటివరకు రోజువారీ 11 లక్షలపైగా పరీక్షలు చేసిన ప్రతిసారి 90 వేలను మించి కేసులు వచ్చేవి. తాజాగా 10.06 లక్షల పరీక్షలకే.. బాధితుల సంఖ్య 96 వేలు ఉండటం గమనార్హం.
దేశంలో 10.17 లక్షల యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం పేర్కొంది. యాక్టివ్ కేసుల్లో 59.8ు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయని, 59.3ు రికవరీలు సైతం ఇవే రాష్ట్రాల్లో నమోదయ్యాయని తెలిపింది. కాగా, మహారాష్ట్ర సహా ఢిల్లీ, ఒడిశాల్లో కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 468 మంది చనిపోయారు. అయితే, కర్ణాటక(93), ఉత్తరప్రదేశ్(81), పంజాబ్ (54) లలో మృతులు తగ్గారు. మహారాష్ట్ర ఇంధన మంత్రి నితిత్రౌత్(63)కు పాజిటివ్ వచ్చింది.