రికార్డ్... వరుసగా ఐదో నెల రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్ళు...

ABN , First Publish Date - 2021-12-02T22:47:04+05:30 IST

జీఎస్‌టీ వసూళ్ళలో మరోమారు రికార్డ్ నమోదైంది. వరుసగా ఐదో నెల రూ. లక్ష కోట్లు దాటాయి. నవంబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.31 లక్షల కోట్లుగా నమోదైంది.

రికార్డ్... వరుసగా ఐదో నెల రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్ళు...

న్యూఢిల్లీ : జీఎస్‌టీ వసూళ్ళలో మరోమారు రికార్డ్ నమోదైంది. వరుసగా ఐదో నెల రూ. లక్ష కోట్లు దాటాయి. నవంబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.31 లక్షల కోట్లుగా నమోదైంది. నాలుగేళ్ళ క్రితం... అంటే 2017 జూలై నెలలో జీఎస్‌టీ అమల్లోకివచ్చిన తర్వాత ఇది రెండో గరిష్టం. నవంబరు నెలలో రూ. 1,31,526 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు నమోదయినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందులో కేంద్ర జీఎస్‌టీ  రూ. 23,978 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీ రూ. 31,127 కోట్లు, సమ్మిళిత జీఎస్‌టీ రూ. 66,815 కోట్లు. దిగుమతులపై వసూలు చేసిన రూ. 32,165 కోట్లతో కలిపితే... సమ్మిళిత జీఎస్‌టీ రూ. 66,815 కోట్లుగా నమోదైంది. సెస్ రూపంలో రూ. 9606 కోట్లు వచ్చాయి. ఇందులో రూ. 653 కోట్లు వస్తు దిగుమతులపై వసూలయ్యాయి.


గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ దఫా జీఎస్‌టీ వసూళ్లు 25 శాతం, 2019 లో ఇదే నెలతో పోలిస్తే 27 శాతం పెరిగాయి. జీఎస్‌టీ  అమల్లోకి వచ్చాక ఇంత మొత్తంలో పన్ను ఆదాయం రావడం ఇది రెండోసారి. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనేందుకు ఇది నిదర్శనమని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఏడాది అక్టోబరులో రూ. 1,30,127 కోట్లు. ఏప్రిల్ లో  రూ. 1.41 లక్షల కోట్ల వసూళ్ళతో ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకినట్లైంది. జీఎస్‌టీ చరిత్రలోనే ఇది రెండో అత్యధికం. ఇక మరిన్ని వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుత(2021-22) ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ వసూళ్లను పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో రూ. 1.41 లక్షల కోట్లు, మే నెలలో రూ. 97,821 కోట్లు, జూన్‌లో రూ. 92,800 కోట్లు, జూలైలో రూ. 1.16 లక్షల కోట్లు, ఆగస్టులో రూ. 1.12 లక్షల కోట్లు, సెప్టెంబరులో రూ. 1.17 లక్షల కోట్లు, అక్టోబరులో రూ. 1.30 లక్షల కోట్లు, నవంబరులో రూ. 1.31 లక్షల కోట్ల వసూళ్ళు  నమోదయ్యాయి.

Updated Date - 2021-12-02T22:47:04+05:30 IST