తదుపరి చీఫ్ జస్టిస్ను సిఫారసు చేయండి!
ABN , First Publish Date - 2022-10-08T08:59:14+05:30 IST
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.
సుప్రీం సీజేకి కేంద్ర ప్రభుత్వం లేఖ
జస్టిస్ చంద్రచూడ్కే అవకాశం?
జస్టిస్ లలిత్ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఆయనే
ఏడేళ్లు సీజేఐగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్ తండ్రి
న్యూఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ప్రధాన న్యాయమూర్తికి శుక్రవారం లేఖ రాశారు. వచ్చే నెల 8న జస్టిస్ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. ఆయన పేరునే ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసే అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైతే జస్టిస్ చంద్రచూడ్ నవంబరు 9న బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 నవంబరు 10 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా 1978 నుంచి 1985 వరకు సీజేఐగా పనిచేశారు.