జాతీయ స్థాయి అవార్డు అందుకున్న యువరైతు

ABN , First Publish Date - 2021-02-28T06:12:14+05:30 IST

చిన్న గ్రామానికి చెందిన యువరైతు ఢిల్లీ స్థాయిలో అవార్డును అందుకున్నాడు. అందరిలా కాకుండా సమీకృత వ్యవసాయాన్ని చేపట్టి సఫలం అయ్యాడు.

జాతీయ స్థాయి అవార్డు అందుకున్న యువరైతు
అవార్డు అందుకుంటున్న రైతు మల్లికార్జున్‌రెడ్డి

చొప్పదండి, ఫిబ్రవరి 27: చిన్న గ్రామానికి చెందిన యువరైతు ఢిల్లీ స్థాయిలో అవార్డును అందుకున్నాడు. అందరిలా కాకుండా సమీకృత వ్యవసాయాన్ని చేపట్టి  సఫలం అయ్యాడు. పంటలకు తోడుగా పాడి పశువులు, గొర్రెలు, చేపల పెంపకాన్ని చేపట్టి అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు. ఆపై ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాడు. ఇవన్నీ జాతీయ స్థాయిలో ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌ అవార్డు ఎంపికకు దారి తీశాయి. మండలంలోని పెద్దకుర్మపల్లికి చెందిన యువరైతు మావురం మల్లికార్జున్‌ రెడ్డిని ఐకార్‌ ఆధ్వర్యంలోని ఐరి(ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌) ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌ అవార్డుకు ఎంపిక చేసింది.  శనివారం ఢిల్లీలో జరిగిన కిసాన్‌మేళాలో  కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి  అవార్డును అందజేశారు. దేశవ్యాప్తంగా 35 మంది రైతులను ఈ అవార్డుకు  ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి మల్లికార్జున్‌రెడ్డి ఒక్కరే కావడం విశేషం. అవార్డును అందుకోవడం జీవితంలో మరిచిపోలేని సంఘటనని, తనను ప్రోత్సహించిన జమికుంటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా మల్లికార్జున్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ అవార్డును అందుకున్న మల్లికార్జున్‌ రెడ్డిని పలువురు అభినందించారు. 

Updated Date - 2021-02-28T06:12:14+05:30 IST