Maharashtra Crisis : ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో ఏక్నాథ్ షిండే మంతనాలు
ABN , First Publish Date - 2022-06-27T18:02:05+05:30 IST
మహారాష్ట్ర అధికార కూటమిలోని శివసేనలో ఏర్పడిన సంక్షోభం
ముంబై : మహారాష్ట్ర అధికార కూటమిలోని శివసేనలో ఏర్పడిన సంక్షోభం రెండో వారంలోకి అడుగు పెట్టింది. వాడివేడిగా జరుగుతున్న పరిణామాల నడుమ శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాజ్తో షిండే రెండుసార్లు టెలిఫోన్ ద్వారా మాట్లాడినట్లు ఎంఎన్ఎస్ నేత ఒకరు సోమవారం ధ్రువీకరించారు.
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) నేత ఒకరు జాతీయ మీడియాతో సోమవారం మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత రాజ్ థాకరేతో ఏక్నాథ్ షిండే (Eknath Shide) రెండుసార్లు టెలిఫోన్ ద్వారా మాట్లాడారని, రాజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులపై చర్చించారని చెప్పారు.
అంతకుముందు శివసేన (Shiv Sena) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) చేసిన వ్యాఖ్యలపై షిండే ఆదివారం ఇచ్చిన ట్వీట్లో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముంబై దాడుల దోషులకు, దావూద్ ఇబ్రహీంకు, అమాయకుల ప్రాణాలను పోగొట్టినవారికి మద్దతిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారితో కలిసి ఎలా కూర్చోగలుగుతున్నారని ప్రశ్నించారు. ఇటువంటి నిర్ణయాన్ని అనుసరించడం కన్నా చావడమే మేలు అని చెప్పారు. అందుకే తాము తిరుగుబాటు చేశామని చెప్పారు. హిందుత్వ భావజాలం కోసం మరణించడానికైనా తాము సిద్ధమేనని, ఈ ఆశయం కోసం మరణించడం తమ అదృష్టంగా భావిస్తామని చెప్పారు.
తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు జీవచ్ఛవాలని, వారి ఆత్మలు మరణించాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతకుముందు శివసేన నేత ఆదిత్య థాకరే (Aditya Thackeray) మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Udhav Thackeray) మే 20న ఏక్నాథ్ షిండేతో మాట్లాడారని చెప్పారు. కావాలనుకుంటే ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలని చెప్పారని తెలిపారు. అప్పుడు షిండే నాటకాలు ఆడారని, ఓ నెల తర్వాత తిరుగుబాటు చేశారని అన్నారు.
తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేల్లో 16 మందికి మహారాష్ట్ర శాసన సభ ఉప సభాపతి అనర్హత నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను వీరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శివసేన శాసన సభా పక్ష నేతగా తాను ఉండగా, అజయ్ చౌదరిని ఆ పదవిలో నియమిస్తూ శివసేన తీసుకున్న నిర్ణయాన్ని షిండే అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.