ఏక్‌నాథ్ షిండేను ఏకగ్రీవంగా ఎన్నుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-06-24T02:20:19+05:30 IST

వాళ్లది(బీజేపీ) జాతీయ పార్టీ. చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని వాళ్లు నాతో అన్నారు. ఒకవేళ నాకేదైనా అవసరమైతే వెంటనే అందుబాటులో ఉంటామని చెప్పారు’’ అని ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్‌నాథ్ షిండే అన్నారు. 56 ఎమ్మెల్యేలు ఉన్న శివసేనలో..

ఏక్‌నాథ్ షిండేను ఏకగ్రీవంగా ఎన్నుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు

ముంబై: ఏక్‌నాథ్ షిండేనే తమ నాయకుడని గువహాటిలో ఉన్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేల కూటమి ఏకగ్రీవంగా ఆమోదించింది. గురువారం సాయంత్రం ఒక హోటల్‌లో సమావేశమైన వీరంతా షిండేను తమ నాయకుడిని ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం, షిండే మాట్లాడుతూ తాము తీసుకున్న నిర్ణయానికి బీజేపీ మద్దతు ఉందని, అవసరమైనప్పుడు వారి మద్దతు ఇస్తారని ఎమ్మెల్యేలతో అన్నారు. షిండే మాట్లాడుతుండగా ఎమ్మెల్యేలు అంతా మద్దతుగా చప్పట్లు కొట్టారు.


‘‘వాళ్లది(బీజేపీ) జాతీయ పార్టీ. చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని వాళ్లు నాతో అన్నారు. ఒకవేళ నాకేదైనా అవసరమైతే వెంటనే అందుబాటులో ఉంటామని చెప్పారు’’ అని ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్‌నాథ్ షిండే అన్నారు. 56 ఎమ్మెల్యేలు ఉన్న శివసేనలో 38 మంది షిండేతోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చే విధంగా బుధవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌తో జరిగిన సమావేశంలో 13 మంది మాత్రమే హాజరయ్యారు. ఒకవేళ నిజంగానే 38 మంది ఎమ్మెల్యేల స్థాయి మద్దతు షిండేకు కొనసాగితే శివసేన పార్టీ థాకరే కుటుంబం నుంచి కోల్పోయే ప్రమాదం ఉంది.


రెబెల్ ఎమ్మెల్యేలంతా బీజేపీతో పొత్తుకు మొగ్గు చూపుతున్నారు. శివసేనను సైతం ఆ విషయమై డిమాండ్ చేస్తున్నారు. ఉద్ధవ్ మంత్రులెవరికీ అందుబాటులో ఉండడం లేదని, ఎవరినీ పట్టించుకోవడం లేదని షిండే క్యాంపు నుంచి ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. షిండేకు సైతం వ్యక్తిగతంగా ఇదే అభిప్రాయం ఉంది. దీనిని అనుసరించి బుధవారం ఉద్ధవ్ థాకరే రాజీనామాకు సిద్ధమంటూ ప్రకటించారు. అవసరమైతే మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం నుంచి తొలగేందుకు సిద్ధమని గురువారం పార్టీ సినియర్ నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. చివరిగా ఏం జరుగుతుందో చూడాలి.

Updated Date - 2022-06-24T02:20:19+05:30 IST