అన్నదమ్ముల దారుణ హత్య
ABN , First Publish Date - 2021-05-14T09:10:16+05:30 IST
పట్టపగలు.. జనమంతా చూస్తుండగానే... నడి రోడ్డుపై కత్తులు, కొడవళ్లతో వెంటాడి ఇద్దరు అన్నదమ్ముల్ని వారి దాయాదులు నరికేసిన ఘటన గురువారం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో కల
కత్తులు, కొడవళ్లతో నిందితుల స్వైర విహారం.. గుంటూరు జిల్లాలో దాయాదుల ఘాతుకం
వట్టిచెరుకూరు, మే 13: పట్టపగలు.. జనమంతా చూస్తుండగానే... నడి రోడ్డుపై కత్తులు, కొడవళ్లతో వెంటాడి ఇద్దరు అన్నదమ్ముల్ని వారి దాయాదులు నరికేసిన ఘటన గురువారం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ముట్లూరు గ్రామంలోని బీసీ కాలనీలకి చెందిన మాజీ ఎంపీటీసీ కుంచాల నాగేశ్వరరావు, కుంచాల రామకోటి అన్నదమ్ములు. నాగేశ్వరరావు కుమారుడు వెంకట్రావు(40), ఆయన చిన్నాన్న రామకోటి కుటుంబాల మధ్య చాలా కాలం నుంచి పాతకక్షలు ఉన్నాయి. రెండు నెలల క్రితం ఇరు కుటుంబాలు పరస్పరం దాడులకు దిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గురువారం ఉదయం ఇరు కుటుంబాల మధ్య స్వల్ప వివాదం జరిగింది.
దీంతో రామకోటి, కుమారుడు నాగరాజు కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మూకుమ్మడిగా వెంకట్రావు గృహంపై దాడి దిగారు. వేటకొడవళ్లు, బరిశెలు, కత్తులతో విచక్షణా రహితంగా వెంటబడి వెంకట్రావును పొడిచారు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అక్కడికి సమీపంలో నివసిస్తున్న వెంకట్రావు తమ్ముడు రాము(35) అక్కడికి రావడాన్ని గమనించి అతడిపై కూడా దాడి చేశారు. మెడ నరకగా అతడు పరుగులు తీస్తూ కిందపడి మృతి చెందాడు. ఆ తర్వాత వెంకట్రావు కుమారులు సుధీర్, మణికంఠలను కూడా తీవ్రంగా గాయపరిచారు. అనంతరం దాడికి వినియోగించిన మారణాయుధాలను ప్రజలందరూ చూస్తుండగానే నీళ్లతో శుభ్రం చేసి సమీపంలోని వారి బంధువుల ఇంట్లో వేసి పారిపోయారు. డీఎస్పీ ప్రశాంతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.