ఇళ్ల అమ్మకాలకు గడ్డుకాలం
ABN , First Publish Date - 2020-04-03T05:44:23+05:30 IST
కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నివాస గృహాల రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో...
- కరోనాతో ఈ ఏడాది 35 శాతం తగ్గొచ్చు
- ఆఫీస్ స్పేస్ డిమాండ్ 30 శాతం తగ్గే అవకాశం: అనరాక్ అంచనా
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నివాస గృహాల రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో (ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణే, హైదరాబాద్) ఇళ్ల అమ్మకాలు 35 శాతం వరకు పడిపోవచ్చని ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ అనరాక్ అంచనా వేస్తోంది. కరోనా ప్రతికూల ప్రభావం వాణిజ్య (ఆఫీ స్,రిటైల్) రియల్ ఎస్టేట్ రంగంపైనా ఉంటుందని పేర్కొంది. గత కొన్నేళ్లుగా మొత్తం ప్రాపర్టీ మార్కెట్లో మందగమనం ఉన్నప్పటికీ ఈ విభాగం మాత్రం మంచి పనితీరును కనబరుస్తోంది. అయితే ఈ ఏడాదిలో మాత్రం ఈ విభాగానికి దెబ్బతప్పదని అనరాక్ చెబుతోంది.
నికరంగా లీజుకు తీసుకునే ఆఫీస్ స్పేస్ 30 శాతం వరకు క్షీణించి 4 కోట్ల చదరపు అడుగుల (2019) నుంచి 2.8 కోట్ల చదరపు అడుగులకు తగ్గవచ్చని చెబుతోంది. ఇదేకాలంలో అద్దెకు తీసుకునే రిటైల్ ప్రదేశం 64 శాతం తగ్గి 85 లక్షల చదరపు అడుగుల నుంచి 31 లక్షల చదరపు అడుగులకు దిగజారవచ్చని పేర్కొంది. ‘కోవిడ్-19- భారత రియల్ ఎస్టేట్పై ప్రభావం’ పేరుతో అనరాక్ ఒక నివేదికను విడుదల చేసింది. కరోనాతో ఈ రంగంపై తీవ్రమైన ప్రభావం పడటమే కాకుండా కార్యకలాపాలు నిలిచిపోయినట్టు పేర్కొంది. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో మరింత గడ్డుకాలం ఉంటుందని, ఈ రం గం రికవరీ కావడానికి ఇంకా కొన్నేళ్లు పడుతుందని తెలిపింది.
2020లో ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఏ విధంగా ఉంటాయో రెండు అంచనాల ఆధారంగా అనరాక్ పేర్కొంది. మొదటి అంచనా (బేస్ కేసు) ప్రకారం.. ఒక త్రైమాసిక కాలంలో కరోనా కట్టడి అయి ఈ రంగానికి సరిపోయేంతగా ఉద్దీపన లభిస్తే 2020లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాదితో పోల్చితే 25ు తగ్గి 2.61 లక్షల ఇళ్ల నుంచి 1.96 లక్షల ఇళ్లకు చేరుకోవచ్చు. రెండో అంచనా (డౌన్సైడ్ కేసు) ప్రకారం.. కరోనా ఒక త్రైమాసిక కాలంలో కట్టడి కాకుండా ఉండి ఎలాంటి ఉద్దీపన లభించకపోతే ఇళ్ల అమ్మకాలు 35 శాతం తగ్గి 1.7 లక్షల ఇళ్లకు చేరుకోవచ్చు.
ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే వారు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. ప్రాజెక్టు సైట్లకు వెళ్లడం లేదు. అంతేకాకుండా కొంత మంది ఇళ్ల ధరల్లో దిద్దుబాటుకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ ఏడాదిలో కొత్తగా అందుబాటులోకి వచ్చే ఇళ్ల సంఖ్య 25-30 శాతం త గ్గవచ్చని అంచనా. గత ఏడాదిలో ఇళ్ల సంఖ్య దాదాపు 2.37 లక్షల యూనిట్లుగా ఉంది.
కరోనా నేపథ్యంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఒకవేళ ఈ విధానం విజయవంతం అయితే ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలపై భవిష్యత్లో దెబ్బపడవచ్చని అంటున్నారు.