రియల్ కలకలం
ABN , First Publish Date - 2022-01-23T05:32:16+05:30 IST
రాష్ట్రప్రభుత్వం మరోసారి భూముల ఽవిలువలను 50 శాతానికి పైగా పెంచబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం రియల్దందాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
రియల్ దందాపై భూముల విలువ పెంపు ప్రభావం
కొద్దిరోజుల్లోనే రిజిస్ట్రేషన్ ధరలు పెరగనున్న ప్రచారంతో సర్వత్రా ఆందోళన
బెంబేలెత్తుతున్న రియల్ వ్యాపారులు, బ్రోకర్లు
డీటీసీపీ అనుమతులకు అనేక కొర్రీలు
నిర్మల్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రప్రభుత్వం మరోసారి భూముల ఽవిలువలను 50 శాతానికి పైగా పెంచబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం రియల్దందాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితమే భూముల విలువలు, రిజిస్ర్టేషన్ల చార్జీలను రెండింతలుగా పెంచిన ప్రభుత్వం మరోసారి వ్యవసాయ భూములతో పాటు అన్ని రకాల భూముల విలువలను, రిజిస్ర్టేషన్ చార్జీలను పెంచబోతున్నట్లు వెలువడుతున్న కథనాలు అంతటా చర్చనీయాంశమవుతున్నాయి. మొన్నటి ధరల పెంపు ప్రభావంతో పడిపోయిన రియల్ ఎస్టేట్ దందా ఇప్పుడిప్పుడే మెల్లగా కొలుకుంటోంది. క్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపా రం పుంజుకుంటున్న కారణంగా సర్కారుకు సైతం ఆధాయం పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఎల్ఆర్ఎస్ పేరిట అనుమతులు లేని ప్లాట్లను రిజిస్ర్టేషన్ చేయకపోతున్న కారణంగా కూడా ఈ వ్యాపారం కుదేలయ్యింది. కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాలతో ప్లాట్లను రిజిస్ర్టేషన్ చేసుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్ల విషయంలో ఎలాంటి నిబంధనలు లేని కారణంగా ఈ దిశగా వ్యాపారం ఆశించినంతగానే సాగింది. మళ్లీ అనూహ్యంగా ప్రభుత్వం వ్యవసాయ భూములతో పాటు ఇతరత్రా భూముల విలువలను పెంచేందుకే కాకుండా రిజిస్ర్టేషన్ చార్జీలను సైతం పెంచేందుకు కసరత్తు మొదలుపెడుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడ్డ వందలాది మంది వ్యాపారులు, బ్రోకర్లు తీవ్రఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం రియల్ వ్యాపారంపై వందలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇక్కడి భూముల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. మారుమూలలో ఉన్న భూములు కూడా ఎకరానికి రూ. కోటికి తగ్గకుండా ధర పలుకుతోందంటే ఇక్కడి భూములకు ఏ మేరకు డిమాండ్ ఉందో అర్థమవుతోంది. కాగా నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు గల హైవేరోడ్డుకు ఇరువైపులా ఉన్న భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. అలాగే నిర్మల్ నుంచి భైంసా వైపు, కడ్తాల్ వైపు, చించోలి వైపు గల భూములకు కూడా విఫరీతమైన డిమాండ్ ఏర్ప డింది. భూముల క్రయవిక్రయాలు కొంతకాలం పాటు కరోనా సైతం ఆటంకంగా మారింది. కరోనా కారణంగా రియల్ వ్యాపారం కుప్పకూలింది. ఇటు రిజిస్ర్టేషన్ చార్జీల పెరుగుదల, కరోనా విస్తరణతో కుదేలైన రియల్ వ్యాపారం ఇప్పుడిప్పుడే తెరుకుంటోంది. మళ్లీ రియల్ వ్యాపారులు, బ్రోకర్లు తమ వ్యాపారంలో క్రీయాశీలకమవుతున్న దశలోనే ప్రభుత్వం మళ్లీ చార్జీల పెంపు పేరిట కొరఢా ఝలిపించబోతుండడంతో ఈ వ్యాపారానికి సంబంధించిన పరిణామాలు ఎటు వైపు వెళతాయోనన్న ఆందోళన నెలకొంటోంది.
ఇప్పటికే పెరిగిన ధరలు
ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం భూముల విలువలను గణనీయంగా పెంచడమే కాకుండా రిజిస్ర్టేషన్ చార్జీలను కూడా పెంచింది. గత సంవత్సరం జూలై 22వ తేదీ నుంచి ధరల పెరుగుదల మొదలైంది. మళ్లీ ఆరునెలలు దాటక ముందే భూముల విలువలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు అంతటా హైరానా సృష్టి స్తోంది. రియల్ ఎస్టేట్ దందాపై ఆధారపడ్డ వారంతా సర్కారు చేస్తున్న కసరత్తుతో ఖంగు తింటున్నారు. ధరలు విఫరీతంగా పెరిగిపోతే దీని ప్రభావం భూముల క్రయవిక్రయాలపై ఉంటుందని కొనుగోళ్లు కూడా పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని రియల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం భూముల విలువలను పెంచేందుకు పకడ్బంధీగా కసరత్తు చేస్తున్న కారణంగా రియల్రంగంలో తుఫాను లేవబోతోందంటున్నారు.
రోడ్డు పాలు కానున్న బ్రోకర్లు
ప్రభుత్వం భూముల విలువలను, రిజిస్ర్టేషన్ ఛార్జీలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో రియల్ వ్యాపారంపై ఆధారపడి బతుకుతున్న వందలాది మంది బ్రోకర్లు రోడ్డు పాలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే భూముల విలువల పెంపుతో కొనుగోలు ప్రక్రియ మందగించిందని మరోసారి ధరలు పెరిగితే ఇక ఈ దందా కుప్పకూలిపోతోందంటున్నారు. బడారియల్ వ్యాపారులకు భూముల ధరలతో ప్ర భావం ఉండకపోవచ్చని, అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వెంచర్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారం సాగించే వారికి అలాగే ఈ దందాను నమ్ముకొని బతుకుతున్న వారందని జీవితాలను సర్కారు నిర్ణ యం ప్రభావితం చేయనుందంటున్నారు. గతంలో కూడా ఆకస్మాత్తుగా ధరలు పెంచి ప్రభుత్వం తమ పొట్టను కొట్టిందని ఈ సారి కూడా అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయని వారు వాపోతున్నారు. పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడేందుకు ధరల పెంపు నిర్ణయంపై పునరాలోచించాలంటూ వారంతా కోరుతున్నారు.
డీటీసీపీ అనుమతులకు అనేక కొర్రీలు
కాగా ప్రభుత్వం అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ర్టేషన్లపై నిషేధం విధించిన నేపథ్యంలో చాలా మంది రియల్ వ్యాపారులు తమ వెంచర్లకు డీటీసీపీ అనుమతులు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ అనుమతుల జారీ విషయంలో అనేక ప్రతిబంధకాలు, కఠిన నిబంధనలు ఉన్న కారణంగా దరఖాస్తుదారులు తీవ్రఇక్కట్లకు గురవుతున్నారని చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒకే రకమైన నిబంధన ఉండడం సమంజసం కాదంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వెంచర్లకు కొంత మేరకు అలాగే రిజిస్ర్టేషన్ చార్జీల విషయంలో కూడా తగ్గింపులు ఉండాలని కోరుతున్నారు.