Indian Airlines hijacker: పాకిస్థాన్ మాటల్లో డొల్లతనం వెల్లడి... అక్కడే ఉంటున్న విమానం హైజాకర్...

ABN , First Publish Date - 2022-09-07T17:25:36+05:30 IST

ఇండియన్ ఎయిర్‌లైన్స్ (Indian Airlines) విమానాన్ని 1981లో హైజాక్

Indian Airlines hijacker: పాకిస్థాన్ మాటల్లో డొల్లతనం వెల్లడి... అక్కడే ఉంటున్న విమానం హైజాకర్...

న్యూఢిల్లీ : ఇండియన్ ఎయిర్‌లైన్స్ (Indian Airlines) విమానాన్ని 1981లో హైజాక్ చేసిన ఉగ్రవాది గజీందర్ సింగ్ విషయంలో పాకిస్థాన్ మాటలు అవాస్తవాలని తేటతెల్లమైపోయింది. ఆయనను అప్పగించాలని భారత ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆయన తమ భూభాగంలో లేడని పాకిస్థాన్ చెప్తూ వస్తోంది. కానీ స్వయంగా ఆ ఉగ్రవాది ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో తాను పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్నానని బయటపెట్టాడు. గురుద్వారా (Gurudwara) ముందు నిల్చుని తీయించుకున్న ఫొటోను సోమవారం తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పెట్టాడు. 


ఇండియన్ ఎయిర్‌లైన్స్ (Indian Airlines) బోయింగ్ 737 (Boeing 737) డొమెస్టిక్ ప్యాసింజర్ విమానం 1981 సెప్టెంబరు 29న అమృత్‌సర్ వెళ్ళేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో బయల్దేరింది.  దాల్ ఖల్సా ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు ఈ విమానాన్ని మార్గమధ్యంలో  హైజాక్ చేశారు. ఈ ఉగ్రవాదుల వద్ద కత్తులు, గ్రెనేడ్లు ఉన్నాయి. 111 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానాన్ని పాకిస్థాన్‌లోని లాహోర్‌కు తీసుకెళ్ళారు. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని, ప్రత్యేక ఖలిస్థాన్ దేశ ఉద్యమ నేత జర్నయిల్ సింగ్ భింద్రన్‌వాలేను జైలు నుంచి విడుదల చేయాలని, 5 లక్షల అమెరికన్ డాలర్లను ఇవ్వాలని  ఈ ఉగ్రవాదులు డిమాండ్ చేశారు. 


ఈ విమానం హైజాకర్లపై పాకిస్థాన్‌ కోర్టు (Pakistan Court)లో విచారణ జరిగింది. వీరికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే వీరిని 1994 అక్టోబరులో పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. 2002 నుంచి పాకిస్థాన్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న గజీందర్ సింగ్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పదే పదే కోరుతోంది. కానీ అతను తమ భూభాగంలో లేడని పాకిస్థాన్ చెప్తోంది. తాజాగా గజీందర్ సింగ్ (Gajinder Singh) స్వయంగా తన లొకేషన్‌ను వెల్లడించడంతో పాకిస్థాన్ అవాస్తవాలు చెప్తోందని బయటపడింది.


Updated Date - 2022-09-07T17:25:36+05:30 IST