వేటకు వేళాయె!
ABN , First Publish Date - 2021-06-14T05:30:00+05:30 IST
మత్స్యకార గ్రామాల్లో సందడి నెలకొంది. రెండు నెలల సుదీర్ఘ విరామానంతరం సము ద్రంలో చేపల వేటకు మత్స్యకారులు సిద్ధమవు తు న్నారు.
నిషేధం ముగియడంతో నేటి నుంచి సముద్రంపైకి వెళ్లేందుకు మత్స్యకారులు సన్నాహాలు
నక్కపల్లి/ ఎస్.రాయవరం/ పాయకరావుపేట రూరల్, జూన్ 14 : మత్స్యకార గ్రామాల్లో సందడి నెలకొంది. రెండు నెలల సుదీర్ఘ విరామానంతరం సము ద్రంలో చేపల వేటకు మత్స్యకారులు సిద్ధమవు తు న్నారు. వేట నిషేధం గడువు సోమవారంతో ముగియడంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకు న్నారు. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో 18 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు ఆరు వేల మంది మత్స్యకారులు నిత్యం చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లోని మత్స్యకారులంతా మంగళవారం తెల్లవారుజాము నుంచి వేటకు సిద్ధపడ్డారు. తొలుత గంగమ్మతల్లికి పూజలు నిర్వహించి, బోట్లపై వెళతారు. ఇప్పటికే ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం, కొత్తపోలవరం, బంగారమ్మపాలెం, రేవువాతాడ, నక్కపల్లి మండలం పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక, రాజయ్యపేట, బోయపాడు, అమలాపురం, డీఎల్పురం, బంగారమ్మపేట, పాయకరావుపేట మండలం వెంకటనగరం, రాజానగరం, రాజవరం, గజపతినగరం, రత్నయ్యమ్మపేట, కొర్లయ్యపేట, పాల్మన్పేట, పెంటకోట గ్రామాల్లోని మత్స్యకారులు వేటకు అవసరమైన వలలు, బోట్లు, డీజిల్, ఐస్ను అందుబాటులో ఉంచుకున్నారు. దీనిపై ఫిషరీస్ పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి అధికారిణి శృతి మాట్లాడుతూ సోమవారంతో చేపల వేట నిషేధం గడువు ముగిసిందని, నిరభ్యంతరంగా మత్స్యకారులు వేట సాగించుకోవచ్చునని సూచించారు. ఇప్పటికే నియోజకవర్గంలో అర్హులైన మత్స్యకారులందరికీ వేట నిషేధ భృతిని వారి ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. సాంకేతిక లోపంతో ఎవరికైనా జమ కాకపోతే అటువంటి వారికి కూడా త్వరలో అందుతాయన్నారు.