జీరో డోర్ నెంబర్లు లేకుండా ఓటర్ల జాబితా : ఆర్డీవో
ABN , First Publish Date - 2022-06-27T01:44:03+05:30 IST
కావలి నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో జీరో డోర్ నెంబర్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో శీనానాయక్ పేర్కొన్నారు.
కావలి, జూన్ 26 : కావలి నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో జీరో డోర్ నెంబర్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో శీనానాయక్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీరో డోర్ నెంబర్లపై రాజకీయపార్టీల నాయకులు ఫిర్యాదు చేశారని, వాటిపై చర్యలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యంగా కావలి పట్టణంలో ఒక్కో ప్రాంతంలో డోర్ నెంబర్లు లేకుండా జీరో డోర్ నెంబర్లు చూపించి దాని పరిధిలో 20 నుంచి 40 ఓట్లు ఉన్నాయన్నారు. జీరో డోర్ నెంబర్లలో ఓటర్లుగా ఉన్న వారు ఆ వివరాలను తమ సమీపంలో బీఎల్వోల దృష్టికి తీసుకెళ్లితే వారు ఆయా వార్డుల సచివాలయాలలో ఉన్న ప్లానింగ్ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లతారన్నారు. కార్యదర్శులు మీ ఇళ్లకు వచ్చి మీరు ఏ డోర్ నెంబర్లలో ఉంటున్నారో తెలుసుకుని ఆ డోర్ నెంబర్లో మీ ఓట్లు ఉండేవిధంగా చర్యలే తీసుకుంటారన్నారు. ఇప్పటికే వారికి ఆదేశాలు ఇచ్చామన్నారు. తదుపరి పబ్లిష్ అయ్యే ఓటరు జాబితాలో ఎక్కడా జీరో డోర్ నెంబర్లు, తప్పులు తడకలు లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.