ప్లాస్టిక్ రహిత సమాజం అందరి బాధ్యత : ఆర్డీవో
ABN , First Publish Date - 2021-10-26T03:30:17+05:30 IST
ప్లాస్టిక్ రహిత సమాజం అందరి బాధ్యత అని ఆర్డీవో శీనానాయక్ అన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన కాలుష్యం పెరిగి పర్యావరణానికే పెను ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని, దీనిని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
కావలి, అక్టోబరు 25: ప్లాస్టిక్ రహిత సమాజం అందరి బాధ్యత అని ఆర్డీవో శీనానాయక్ అన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన కాలుష్యం పెరిగి పర్యావరణానికే పెను ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని, దీనిని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారి వినతి మేరకు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం సోమవారం ఆర్డీవో వివిధ శాఖల అధికారులతో తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్లాస్టిక్ సంచుల స్థానంలో గుడ్డ సంచులు వాడుకలోకి తీసుకు రావాలని, అలాగే పట్టణంలో ప్లాస్టిక్సంచుల వినియోగం లేకుండా దాడులు చేసి అరికట్టాలని మరికొందరు, ముందుగా ప్లాస్టిక్ వ్యాపారులను హెచ్చరించి వారికి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు చెప్పారు. అలాగే ప్లాస్టిక్ వినియోగం వలన వచ్చే ప్రమాదాలను వివరిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న కావలి ఏరియా వైద్యశాలలో వందమంది రక్తదానం చేసేట్లుగా ప్రణాళికను రూపొందించి రక్తదాతలను మోటివేట్ చేయాలన్నారు. మలేరియా సోకకుండా పట్టణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ డీ. ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బీ. శివారెడ్డి, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ మండవ వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం బాధ్యులు, రెడ్క్రాస్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.