కార్డు రాక.. జరిమాన కట్టలేక

ABN , First Publish Date - 2021-05-13T05:26:38+05:30 IST

వాహనాలకు సంబంధించి రిజిస్ర్టేషన్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సుల మంజూరులో తీవ్ర జాప్యమవుతోంది. 18 నెలలుగా రవాణా శాఖ వీటిని అందజేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీసులు అడుగడుగునా వాహన తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినా...

కార్డు రాక.. జరిమాన కట్టలేక
ఇచ్ఛాపురంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు





- 18 నెలలుగా అందని ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్సులు

- కర్ఫ్యూ వేళ తనిఖీలతో వాహనదారుల ఆందోళన

(ఇచ్ఛాపురం రూరల్‌)

వాహనాలకు సంబంధించి రిజిస్ర్టేషన్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సుల మంజూరులో తీవ్ర జాప్యమవుతోంది. 18 నెలలుగా రవాణా శాఖ వీటిని అందజేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీసులు అడుగడుగునా వాహన తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినా... సరైన పత్రాలు చూపకపోయినా భారీగా జరిమానా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేతిలో ఆర్సీ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు  వాపోతున్నారు. కొత్త వాహనాలకు చెందిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షోరూముల్లోనే పూర్తి చేస్తుండటంతో రవాణా శాఖను పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ క్రమంలో ఈ శాఖకు అప్పగించిన కొన్ని పనులను కూడా సక్రమంగా పూర్తి చేయని దుస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 10 లక్షలకు పైగా రవాణా, రవాణేతర వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ఏటా వేలల్లో కొత్త వాహనాలు అమ్ముడుపోతున్నాయి. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతోంది. కానీ వాహనదారులకు రిజిస్ట్రేషన్‌ కార్డులను మాత్రం సక్రమంగా పంపడం లేదు. 2019 నవంబరు నుంచి నేటి వరకు జిల్లాలో 1.80 లక్షల మంది డ్రైవింగ్‌ లైసెన్సులు చేయించుకున్నారు. గత ఏడాది అక్టోబరు నుంచి 1.20 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వారికి ఇప్పటి వరకు పత్రాలు అందలేదు. కార్డులు ఇంటికి రాకపోవడంతో ఆర్సీల కోసం వాహనదారులు రవాణా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్సులు మంజూరు చేయాలని కోరుతున్నారు.  


నెలాఖరుకు రావచ్చు 

ప్రభుత్వం నుంచి కార్డులు సరఫరా రాకపోవడంతో ఇవ్వలేకపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. పోలీసు తనిఖీల్లో వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎస్పీ అనుమతితో సంబంధిత నకలు ప్రతిపై ముద్రించి ఇస్తున్నాం. అది చూపిస్తే సరిపోతుంది. కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన తరువాత ఈ నెలాఖరు నాటికి జిల్లాకు కార్డులు వచ్చే అవకాశముంది.

- వడ్డి సుందర్‌, ఉప కమిషనర్‌, రవాణా శాఖ


Updated Date - 2021-05-13T05:26:38+05:30 IST