రాష్ట్రాలకు, ఎగుమతిదారులకు ఊరట
ABN , First Publish Date - 2020-04-02T05:44:19+05:30 IST
కరోనా కష్టాల నుంచి ఊరట కల్పించేందుకు ఆర్బీఐ మరిన్ని చర్యలు ప్రకటించింది. ఒకటేమో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల కోసం
- ఆర్బీఐ తాజా నిర్ణయం
ముంబై: కరోనా కష్టాల నుంచి ఊరట కల్పించేందుకు ఆర్బీఐ మరిన్ని చర్యలు ప్రకటించింది. ఒకటేమో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల కోసం కాగా.. మరో రెండు చర్యలేమో ఎగుమతిదారులు, బ్యాంకుల కోసం. ఆ వివరాలు..
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సె్స (డబ్ల్యూఎంఏ)లో భాగంగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే రుణాల పరిమితిని 30 శాతం పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నెల 1 నుంచే అమలులోకి వచ్చిన పరిమితి పెంపు.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (సెప్టెంబరు 30) వరకు అందుబాటులో ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు ద్రవ్య కొరతను తీర్చుకునేందుకు ఈ నిధి నుంచి గరిష్ఠంగా 90 రోజుల కోసం రుణం తీసుకునే వీలుంటుంది.
వస్తువులు లేదా సాఫ్ట్వేర్ ఎగుమతులపై రాబడిని స్వదేశానికి తరలించేందుకు మరింత సమయం కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఎగుమతి రాబడిని ఎగుమతి తేదీ నుంచి 9 నెలల్లోగా స్వదేశానికి తరలించాలి. ఈ ఏడాది జూలై 31 వరకు ఎగుమతులకు ఈ గడువును 15 నెలలకు పెంచింది.
బ్యాంకులు కౌంటర్సైకిల్ క్యాపిటల్ బఫర్స్ (సీసీవైబీ)ని మరో ఏడాది వరకు అమలులోకి తీసుకురానవసరం లేదని ఆర్బీఐ తెలిపింది. అంటే, ఈ బఫర్ కోసం కేటాయించాల్సిన నిధులను బ్యాంకులు ఇతర అవసరాలకు ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది.