కామత్ కమిటీ ఏర్పాటు
ABN , First Publish Date - 2020-08-08T06:25:56+05:30 IST
కరోనా సంక్షోభం కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న రుణాలను గుర్తించి ఆర్బీఐ ప్రకటించిన రుణ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను అమలుపరిచేందుకు విధివిధానాలు సూచించేందుకు కేవీ కామత్ కమిటీని శుక్రవారం ఆర్బీఐ ఏర్పాటు చేసింది...
ముంబై: కరోనా సంక్షోభం కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న రుణాలను గుర్తించి ఆర్బీఐ ప్రకటించిన రుణ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను అమలుపరిచేందుకు విధివిధానాలు సూచించేందుకు కేవీ కామత్ కమిటీని శుక్రవారం ఆర్బీఐ ఏర్పాటు చేసింది. కార్పొరేట్, రిటైల్ కస్టమర్లకు ఏకకాల రుణ పునర్ వ్యవస్థీకరణ అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్బీఐ గురువారం ప్రకటించిన విషయం విదితమే. ఆర్బీఐ ప్రకటనకు అనుగుణంగా ఏర్పాటైన కామత్ కమిటీ 30 రోజుల్లోగా తన సిఫారసులు అందించాల్సి ఉంటుంది. రంగాల వారీగా పరిస్థితిని మదింపు చేసి ఆయా రంగాలు ఎదుర్కొంటున్న ఒత్తిడి ఆధారంగా పరిష్కార ప్రక్రియకు అమలుపరచదగిన ఆర్థికాంశాలను కామత్ కమిటీ వేర్వేరుగా సిఫారసు చేయాల్సి ఉంటుంది. అశ్విన్ పరేఖ్ స్ర్టాటజీ అడ్వైజర్గా వ్యవహరించే ఈ కమిటీలో దివాకర్ గుప్తా, టీఎన్ మనోహరన్ సభ్యులుగా ఉంటారు.