ధాన్యం బకాయిలు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-07-08T03:55:02+05:30 IST
ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు తక్షణం చెల్లించాలని రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు కోరారు.
జేసీ కూర్మనాథ్కు వినతి
కలెక్టరేట్ వద్ద జలదంకి రైతుల నిరసన
నెల్లూరు(హరనాథపురం), జూలై 7 : ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు తక్షణం చెల్లించాలని రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు కోరారు. నిల్వ ఉన్న ధాన్యం కోనుగోలు చేయాలని, ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలని కోరుతూ జలదంకి మండలానికి చెందిన పలువురు రైతులు గురువారం కలెక్టరేట్ వద్దకు చేరుకుని రైతు సంఘాల ప్రతినిధులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్కు వినతిపత్రం అందజేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సీఎ్సఆర్ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా సక్రమంగా జరగలేదన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వలన రైతులు మిల్లులకు తోలిన సుమారు 40వేల టన్నుల ధాన్యానికి ప్రొక్యూర్మెంట్ జరగకుండా నిలిచిపోయిందన్నారు. దీంతో రెండోపంట కూడా సాగుచేయలేదన్నారు. సేకరించిన ధాన్యానికి నెలల తరబడి డబ్బు చెల్లించకపోతే చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్రరెడ్డి, వి.శ్రీనివాసులరెడ్డి, పి.రాజా, డి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.