బీజేపీకి బుద్ధిచెప్పండి: నారాయణ

ABN , First Publish Date - 2021-04-13T06:58:47+05:30 IST

మతతత్వ రాజకీయాలు చేసే బీజేపీకి ఓటర్లు బుద్ధిచెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు.

బీజేపీకి బుద్ధిచెప్పండి: నారాయణ
శ్రీకాళహస్తి సభలో ప్రసంగిస్తున్న నారాయణ

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 12: మతతత్వ రాజకీయాలు చేసే బీజేపీకి ఓటర్లు బుద్ధిచెప్పాలనీ, తిరుపతి ఉప ఎన్నికల్లో రత్నప్రభకు డిపాజిట్లు కూడా దక్కవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం పలికారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల బరిలో నిలిచిన వామపక్ష పార్టీల అభ్యర్థి యాదగిరిని ఆశీర్వదించాలని కోరుతూ సోమవారం ఆయన శ్రీకాళహస్తిలో రోడ్‌షో నిర్వహించారు. ర్యాలీగా పట్టణ పెండ్లిమండపం వద్దకు చేరుకున్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిన బీజేపీ మాట తప్పిందన్నారు. బీజేపీకి భయపడే ఈ అంశంపై వైసీపీ, టీడీపీలు మాట్లాడటం లేదన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలపై పోరాటం చేస్తున్న రైతు ఉద్యమానికి చంద్రబాబు నాయకత్వం వహించి ఉంటే బంగారు భవిష్యత్తు ఉండేదన్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తేలేని వైసీపీ, టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. స్వార్థ రాజకీయాల కోసమే పవన్‌ కల్యాణ్‌ టీషర్టు పారేసి... కాషాయ దుస్తులు ధరించారని విమర్శించారు. శ్రీకాళహస్తి ప్రాంతం వామపక్ష ఉద్యమానికి పెట్టనికోట అన్నారు. గతంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోపై దాడి చేసిన చైర్మన్‌పై చర్యలు తీసుకునేలా వామపక్ష పార్టీలు ఉద్యమించాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, నాయకులు నాగేశ్వరరావు, పెంచలయ్య, రమాదేవి, వెంకటేశ్వర్లు, నాగరాజు, నూర్‌అహ్మద్‌, పుల్లయ్య, జనమాల గురవయ్య, గంధం మణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T06:58:47+05:30 IST