రేషన్ సరుకులు ఎప్పుడు పంపిణీ చేస్తారు..?
ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST
పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో రేషన్ సరకులు ఎప్పుడు పంపిణీ చేస్తారని స్థానిక మహిళలు ప్రశ్నిస్తున్నారు.
కలికిరి, మే 16: పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో రేషన్ సరకులు ఎప్పుడు పంపిణీ చేస్తారని స్థానిక మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఆమేర కు కాలనీకి చెందిన పలువురు మహిళలు సోమవారం తహసీల్దారు రమణిని కలిసి ఇందిరమ్మ కాలనీలో రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ కావడం లేదని ఫిర్యాదు చేశారు. మే నెలలో పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటికీ రేషన్ ఇవ్వలేదని సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం లేదని వాపోయారు. అస లు ఇందిరమ్మ కాలనీకి కేటాయించిన ఎండీయూ వాహనం సక్రమంగా కాలనీలోకి రావడం లేదని వారు తహసిల్దార్ ఎదుట సమస్య ను ఏకరువు పెట్టారు. ఒక్కో నెలలో ఒక్కో వాహనం వస్తుందని, కాలనీకి కేటాయించిన వాహనమేదో? ఇంతవరకూ ఎవరికీ తెలియదని వాపోయారు. వచ్చే వాహనదార్లు కూడా ప్రజలకు జవాబుదారీగా సమాధానం చెప్పడం లేదని ఆరు నెలల క్రితం కూడా ఇదే విధంగా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ సందర్భంగా తహసీ ల్దార్ మాట్లాడుతూ ఇక నుంచి సరుకులు సకాలంలో సక్రమంగా పంపిణీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు : ఎంపీపీ
కాగా జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని వాటిని సరిదిద్దమని ఎన్ని సార్లు విన్నవించినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీపీ నూర్జహాన్, జడ్పీటీసీ పద్మజలు తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. ఒక్కో స్థలానికి రెండు మూడు పట్టాలిచ్చారని, కొంత మంది అర్హులైన వారికి పట్టాలే ఇవ్వలేదని చెప్పారు. పట్టా కాగితాలున్న వారు నిర్మాణాలు ప్రారంభించాలన్నా క్షేత్ర స్థాయిలో వేరెవరో ఇళ్లు నిర్మించుకుంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నట్లు వివరించారు. వెంటనే స్థలాల సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దారు హామీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులతోపాటు ఎస్టీడీ హరి, బావాజాన్ తదితరులు పాల్గొన్నారు.