చౌక బియ్యం పంపిణీలో అవాంతరాలు
ABN , First Publish Date - 2022-01-20T05:33:08+05:30 IST
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పేదల బియ్యం పంపిణీలో అనేక అవాంతరాలు ఎదురౌతున్నాయి.
సిగ్నల్ అందకపోవడమే ప్రధాన కారణం
ఇబ్బందిపడుతున్న లబ్ధిదారులు
ఉదయం నుంచి సాయంత్రం దాకా పడిగాపులు
మణుగూరు రూరల్, జనవరి 19: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పేదల బియ్యం పంపిణీలో అనేక అవాంతరాలు ఎదురౌతున్నాయి. మణుగూరు మండలంలోని రామానుజవరం, సాంబాయిగూడెం, పగిడేరు, దమ్మక్కపేట గ్రామ పంచాయతీల్లో బియ్యం పంపిణీకి అడ్డంకులు ఎదురౌతున్నాయి. పేదలు బియ్యం తీసుకోవాలంటే ఐరీష్, వేలిముద్రలు విధానం తప్పని సరి. అయితే వయసు మీరిన వారు దీంతో పడే ఇబ్బందులు చెప్పనలవిగా మారుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ఇటీవల ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్ లింక్తో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాల్లో సెల్ సిగ్నల్స్ సక్ర మంగా లేక ఓటీపీ(వన్ టైం పాస్వర్డ్) రాక ప్రజలు రేషన్ తీసుకోలేక పోతున్నారు. పండుగల సమయాల్లో కూడా ఇవే సమస్యలు తలెత్తతుండటంతో పండగ నాడు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. ప్రజలు రేషన్ షాపుల ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు గాచినా రేషన్ బియ్యం దొరికే పరిస్ధితి లేదు. సిగ్నల్స్ పేరుతో సాకు చూపుతూ బియ్యం ఇవ్వకపోవడంతో పేద ప్రజలు అనేక ఇబ్బం దులకు గురౌతున్నారు. గత కొద్ది రోజుల క్రి తం సంక్రాంతి పండుగ పూట కూడా సిగ్నల్ సాకుతో బియ్యం ఇవ్వకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పేదలు వాపోతున్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎంతగా మొరపెట్టుకున్నా ప్రయోజనం కన్పించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ కార్డు ఉన్న ప్రతీ పేద కుటుంబానికి ప్రత్యామ్నాయ విధానంలో బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విష యంపై జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.