రేపటి నుంచే రేషన్ సరకులు
ABN , First Publish Date - 2020-12-04T06:09:44+05:30 IST
జిల్లాలో బియ్యం కార్డుదారులకు ఈ నెల ఐదో తేదీ నుంచి బియ్యం, కందిపప్పు, పంచదార సరఫరా చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బియ్యం కార్డుదారులకు ఈ నెల ఐదో తేదీ నుంచి బియ్యం, కందిపప్పు, పంచదార సరఫరా చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బియ్యం కిలో రూపాయి, కందిపప్పు రూ.67, అరకిలో పంచదార రూ.17కు కార్డుదారులకు అందజేస్తామన్నారు. కాగా డిపోలకు సరకుల చేరవేత ఆలస్యం కావడంతో ఈ నెల ఆరో తేదీ నుంచి పంపిణీ చేయాలని భావించారు. అయితే ఐదో తేదీ నుంచే ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
ధాన్యం కొనుగోలుపై కంట్రోల్రూమ్
ఖరీఫ్లో పండే ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 150 కేంద్రాలు ఏర్పాటుచేశామని జేసీ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. ఏజెన్సీలో 43, వెలుగు ద్వారా 46, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఏర్పాటుచేసిన 61 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈ విషయంలో రైతుల సందేహాలు నివృత్తిచేయడానికి పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్రూమ్ ఏర్పాటుచేశామన్నారు. 0891-2565939, 77020 03580కు ఫోన్ చేయవచ్చునని సూచించారు.