తెల్ల కార్డుదారులందరికీ రేషన్
ABN , First Publish Date - 2020-03-29T10:22:01+05:30 IST
జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ బియ్యం, ఇతర సరకులు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
సర్వేతో సంబంధం లేకుండా సరకులు
విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ బియ్యం, ఇతర సరకులు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. బియ్యం కార్డుతో సంబంధం లేకుండా తెల్లకార్డు ఉంటే రేషన్ సరకులు అందజేస్తారు. గత నెల సర్వేలో 75,989 మందిని అనర్హులుగా గుర్తించారు. అయితే ఆ ఊసెత్తకుండా పాత జాబితాలో ఉన్న 12,45,250 కార్డుదారులందరికీ సరకులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పౌరసరఫరాల అధికారులను జాయింట్ కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశించారు.
ఆదివారం నుంచి జిల్లాలో తెల్ల కార్డుదారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా, పంచదార, గోధుమపిండి సబ్సిడీ రేటుకు అందజేస్తారు. సరకుల పంపిణీకి సహాయ పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు.