రాష్ట్రంలో డోర్ డెలివరీ సౌకర్యవంతం
ABN , First Publish Date - 2021-10-27T05:42:25+05:30 IST
రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ విధానం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉందని ఆంధ్రప్రదేశ్ చౌకధరల దుకాణదారుల సంఘాల సంక్షేమ సమాఖ్య నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 26: రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ విధానం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉందని ఆంధ్రప్రదేశ్ చౌకధరల దుకాణదారుల సంఘాల సంక్షేమ సమాఖ్య నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్టు భవనంలో మంగళవారం ఆలిండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్తో రాష్ట్ర సమాఖ్య ఆత్మీయ కార్యాచరణ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం నాయకులు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రేషన్ డోర్ డెలివరీ సౌకర్యవంతంగా ఉందని, అయితే ఇతర సరుకులు కార్డుదారులకు ఇవ్వకపోవడంతో డీలర్లు ఆదాయం కోల్పోయారని, దీనికి బదులుగా ప్రభుత్వమే ఆదాయవనరులు కల్పించాలని కోరారు. దిగుమతి కూలీ వెంటనే డీలర్లకు చెల్లించాలన్నారు. ప్రభుత్వం ఖాళీ సంచులను డీలర్లకే తిరిగి ఇవ్వాలని, డీలర్లకు ఇచ్చే కమిషన్ రూ.1 నుంచి రూ.3కు పెంచాలని కోరారు. రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి, ఆలిండియా ఫెడరేషన్ అఽధ్యక్షుడు పుష్పరాజ్ దేశ్ముఖ్, ప్రధాన కార్యదర్శి బిశ్వంభర్బసు, జాతీయ ఉపాధ్యక్షుడు కె.సుబ్బారావు, రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు కేఎస్ఆర్ రావు, ప్రధాన కార్యదర్శి గిరిజారావు తదితరులు పాల్గొన్నారు.