డీలర్లకు కందిపప్పు తిప్పలు!
ABN , First Publish Date - 2022-09-23T06:42:09+05:30 IST
రాష్ట్ర స్థాయిలో రేషన్ పంపిణీ విధివిధానాలు లోపభూయిష్టంగా ఉ న్నాయి. ప్రస్తుతం పండుగ రోజు లు వస్తున్నాయన్న ఉద్దేశ్యంతో అందరికీ పంచదార, కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరులో ఇచ్చేందుకు డీడీలు తీయాలంటే రేషన్డీలర్లకు దిశానిర్దేశం చేసింది.
- వినియోగదారుల నుంచి స్పందన కరువు
- అక్టోబరు నెలకు డీడీలు తీయాలంటూ ఆదేశాలు
- డీలర్ల గుండెల్లో గుబులు
- నాణ్యతలేని సరుకు కేటాయింపు
జిల్లాలో రేషన్ సరుకుల కేటాయింపులు సవ్యంగా సాగడంలేదు. బియ్యం మాత్రమే ప్రతినెల యథావిధిగా పంపిణీ చేస్తున్నారు. పంచదార, కందిపప్పు పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. కొన్నినెలలుగా పంచదార ఇవ్వడం లేదు. కందిపప్పు మాత్రం ఇస్తున్నప్పటికీ నాణ్యత లేకుండా ఉంటోంది. దీంతో డీలర్లు తీసుకున్న సరుకు నిల్వ ఉండిపోతోంది. పంచదార మాత్రం జిల్లాలో ఎంఎల్ఎస్ పాయింట్లవద్ద అందుబాటులో ఉంటే ఇస్తున్నారు. లేదంటే చేతులెత్తేసే పరిస్థితి. ఈ క్రమంలో వచ్చే నెలకు కందిపప్పునకు డీడీలు తీయాలంటూ ఆదేశించడంతో డీలర్లలో ఆందోళన మొదలైంది. నాణ్యత లేని కందిపప్పు తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపకుంటే తాము నిండా మునిగిపోతామని వాపోతున్నారు.
తుని, సెప్టెంబరు 22: రాష్ట్ర స్థాయిలో రేషన్ పంపిణీ విధివిధానాలు లోపభూయిష్టంగా ఉ న్నాయి. ప్రస్తుతం పండుగ రోజు లు వస్తున్నాయన్న ఉద్దేశ్యంతో అందరికీ పంచదార, కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరులో ఇచ్చేందుకు డీడీలు తీయాలంటే రేషన్డీలర్లకు దిశానిర్దేశం చేసింది. వచ్చేనెలకు సంబంధించి ఈనెల 25వ తేదీలోపు డీడీలు సమర్పించాలి. ఇదే ఇప్పుడు డీలర్లలో గుబులు రేకెత్తిస్తోంది. బియ్యానికి కొద్దిపాటి సొమ్ములు చెల్లిస్తే సరిపోతుంది. కానీ పంచదార, కందిపప్పులకు పెద్దమొత్తంలో చెల్లించాలి. పైగా కార్డుదారులనుంచి స్పందన అంతంత మాత్రమే ఉంటోంది. నాణ్యత లేకపోవడంతో కందిపప్పు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల నష్టపోతున్నామంటూ డీలర్లు ఆందోళన చెందుతున్నారు.
నాణ్యత లేని కందిపప్పు..
ప్రభుత్వం అందిస్తున్న కందిపప్పు నాణ్యత ఉండడంలేదు. ప్రతి రేషన్కార్డుకు కిలో వంతున వచ్చే పప్పు కేటాయిస్తున్నారు. లబ్ధిదారులు కిలో రూ.67 చెల్లించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో రూ.90కిపైగా ఉన్నప్పటికీ రేషన్ పప్పుపై ఆసక్తి చూపడంలేదు. దీంతో డీలర్ల వద్ద నిల్వ ఉండిపోవడంతో పప్పునకు పురుగు పట్టేస్తుంది. దీంతో డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ రేషన్లో కందిపప్పు తప్పనిసరి చేస్తే 643 టన్నుల అవసరం కానుంది. పంచదార అయితే 322 టన్నులు కేటాయించాలి. పంచదారను లబ్ధిదారులకు అరకిలో వంతున రూ.17కు ఇస్తున్నా రు. బహిరంగ మార్కెట్లో అరకిలో రూ.20 ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమైతే కందిపప్పు కోసం డీలర్లు కిలోకు రూ.66చొప్పున దాదాపు 4.24కోట్లు చెల్లించాలి. వినియోగదారులు తీసుకోకుంటే ఆ మొత్తాన్ని డీలర్లే భరించాలి. అదే ఇప్పుడు జిల్లాలో రేషన్ డీలర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే డీలర్ల వద్ద గతంలో ప్రభుత్వం కేటాయించిన కందిపప్పు నిల్వ ఉంది. మళ్లీ ఇప్పు ఇదేమి తిప్పలంటూ డీలర్లు ఆవేదన చెందుతున్నారు. నాణ్యత మెరుగుపర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డీలర్లు కోరుతున్నారు.