కదిలిన రథం.. భక్తుల పరవశం
ABN , First Publish Date - 2022-05-05T14:24:06+05:30 IST
కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్లో మూడు వేల ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ఆదికేశవ పెరుమాళ్ ఆలయంలో రామానుజాచార్యుల 1,005వ అవతార బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 108 దివ్యదేశాల్లో భూతపురి క్షేత్రంగా విలసిల్లుతున్న ఈ ఆలయం లో
- నేత్రపర్వంగా రామానుజుల రథోత్సవం
- శ్రీపెరుంబుదూర్లో పోటెత్తిన భక్తజనం
ప్యారీస్(చెన్నై): కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్లో మూడు వేల ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ఆదికేశవ పెరుమాళ్ ఆలయంలో రామానుజాచార్యుల 1,005వ అవతార బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 108 దివ్యదేశాల్లో భూతపురి క్షేత్రంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో రామానుజాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. చిత్తిరై నెల తిరువాదిరై నక్షత్రం రోజున 1,017వ సంవత్సరం రామానుజాచార్యుల వారు జన్మించారు. ఆలయాల నగరంగా ప్రసిద్ధిచెందిన శ్రీపెరుంబుదూర్లో ఆదికేశవ పెరుమాళ్ను పెద్దాయన అని, రామానుజర్ను చిన్నాయన అని భక్తులు పిలుచుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది రామానుజాచార్యుల అవతార బ్రహ్మోత్సవాలు పదిరోజులుగా కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో జరిగే వేడుకల్లో ప్రధానాంశం ఆదికేశవ పెరుమాళ్కు పది రోజుల ఉత్సవం, రామానుజర్కు పది రోజులు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. గత నెల 16వ తేది ధ్వజారోహణంతో చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదికేశవ పెరుమాళ్కు సింహ వాహనం, గరుడ సేవ, గజ వాహనం, అశ్వ వాహనం, రథోత్సవం చొప్పున పదిరోజుల ఉత్సవాలు గత నెల 25న ముగిశాయి. అనంతరం రామానుజుల వారి 1005వ అవతార బ్రహ్మోత్సవాలు 26 నుంచి ప్రారంభమయ్యాయి. 9వ రోజైన బుధవారం రామానుజుల రథోత్సవం కోలాహలంగా జరిగింది. ఆయన కాంస్య విగ్రహాన్ని రథంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రథోత్సవానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివెళ్లడంతో శ్రీపెరుంబుదూర్ కిటకిటలాడింది. ఉదయం 8 గంటలకు ఆలయ ప్రధాన ప్రవేశద్వారం నుంచి కదిలిన రథం తేరడి వీధి, తిరువళ్లువర్ రోడ్డు, తిరుమంగై ఆళ్వార్ వీధి తదితర ప్రధాన వీధుల మీదుగా సుమారు 2 కి.మీ సాగింది. కాగా, మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు పలు ఆధ్యాత్మిక సంస్థలు మజ్జిగ, పానకం పంపిణి చేసి, అన్నదానం చేశారు. రద్దీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కాంచీపురం జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.