ఘనంగా ప్రారంభమైన రథయాత్ర
ABN , First Publish Date - 2022-07-02T05:21:01+05:30 IST
జిల్లాలో శుక్రవారం రథయాత్ర ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. దీంతో అంతటా జగన్నాథుని నామస్మరణ మార్మోగింది. రథంపై కొలువైన స్వామివారిని దర్శించిన భక్తులు పులకించిపోయారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు
దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
(పార్వతీపురంటౌన్/సాలూరు/పాలకొండ)
జిల్లాలో శుక్రవారం రథయాత్ర ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. దీంతో అంతటా జగన్నాథుని నామస్మరణ మార్మోగింది. రథంపై కొలువైన స్వామివారిని దర్శించిన భక్తులు పులకించిపోయారు. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండలోని ప్రధాన ఆలయాల్లో జగన్నాఽథ, సుభద్ర, బలరాముల ఉత్సవమూర్తులకు శాస్ర్తోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం రథంపై కొలువుతీర్చి గుడించా మందిరానికి తరలించారు. ఓ వైపు చిరుజల్లులు కురుస్తున్నా.. రథయాత్రలో భారీగా భక్తులు పాల్గొని జై జగన్నాథ అంటూ నామస్మరణ చేశారు. మొత్తంగా అర్చకులు, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో తొలి దశ ప్రక్రియ ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీ వరకూ వివిధ అవతరాల్లో స్వామివారు దర్శనమివనుండగా, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు జరుపుకోలేకపోయిన జగన్నాథస్వామి రథయాత్రను ఈ సారి అన్నిచోట్లా ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలను చెందిన భక్తులు కూడా పెద్దఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.