ఒబులాపూర్లో గ్రామస్థుల రాస్తారోకో
ABN , First Publish Date - 2022-01-24T06:43:26+05:30 IST
ఒబులాపూర్ గ్రామానికి చెందిన అటవీ భూములు దురాక్రమణకు గురవుతున్నాయని అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ప్రధాన రహదారి పై గ్రామస్థులు గంట పాటు రాస్తారోకో జరిపారు.
అటవీ భూములు పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్
మల్లాపూర్, జనవరి 23 : ఒబులాపూర్ గ్రామానికి చెందిన అటవీ భూములు దురాక్రమణకు గురవుతున్నాయని అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ప్రధాన రహదారి పై గ్రామస్థులు గంట పాటు రాస్తారోకో జరిపారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రెవెన్యు, పోలీస్ అధికారులు సిబ్బందితో ఒబులాపూర్ గ్రామానికి చేరుకుని సమస్యను తెలుసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు ఒబులాపూర్ శివారులో గల కొన్ని భూములు పునరావాస గ్రామాలైన రత్నాపూర్, కుస్తాపూర్కు కేటాయించారు. కేటాయించిన భూముల పట్టాదారులు కొన్నేండ్లుగా సాగు చేసుకోలేదు. ఇటీవల భూములను పట్టాదారులు చదును చేసే ప్రయత్నం చేయగా ఒబులాపూర్ గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇందులో భాగంగా ఒబులాపూర్ గ్రామస్థులు తమ గ్రామానికి చెందిన అటవీ భూములను అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. సదరు భూములను సంబంధిత అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని కోరారు. సమస్య ముదరక ముందే చర్యలు తీసుకుంటే పునరావాస గ్రామాల సమస్య తీరనుందని మండల ప్రజలు పేర్కొంటున్నారు. భూములను పరిశీలిస్తామని హామీ మేరకు గ్రామస్థులు ఆందోళనను విరమించారు.