కలెక్టర్ గారూ.. మీరు ఎటువైపు?
ABN , First Publish Date - 2020-11-25T05:52:23+05:30 IST
కలెక్టర్ గారూ.. మీరు ఎవరి పక్షాన ఉంటారు? అని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కార్మికులు ప్రశ్నించారు.
- ఎంపీ, ఎమ్మెల్యే పక్షానా? రైతులు, కార్మికుల పక్షానా?
- ఆర్ఏఆర్ఎస్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
నంద్యాల, నవంబరు 24: కలెక్టర్ గారూ.. మీరు ఎవరి పక్షాన ఉంటారు? అని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కార్మికులు ప్రశ్నించారు. మంగళవారం ఆర్ఏఆర్ఎస్ ప్రధాన ద్వారం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఆర్ఏఆర్ఎస్ కార్మికుల సంఘం కార్యదర్శి ఏవీ రమణ అధ్యక్షతన ఈ నిరసన చేపట్టారు. కార్మికులు మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే పక్షానా ఉంటారా?, రైతులు, కార్మికుల పక్షానా ఉంటారా? అని కార్మికులు కలెక్టర్ను ప్రశ్నించారు. సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, కార్మిక సంఘం నాయకులు రమణ, ఖాదర్వలి, పుల్లయ్య ప్రసంగించారు. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఆర్ఏఆర్ఎస్ భూములను వైద్య కళాశాల కోసం తీసుకోవద్దని కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు అందరూ విన్నవిస్తున్నా ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించకపోవటం దారుణ మన్నారు. తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం జగన్ దృష్టికి ఆర్ఏఆర్ఎస్ భూముల వ్యవహారాన్ని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్ తీసుకెళ్లకపోవడం చూస్తుంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఎంపీ పోచా, ఎమ్మెల్యే శిల్పా రవి ఆలోచనంతా తమ భూముల రేట్లు పెంచుకోవడం పైనే ఉందన్నారు. కలెక్టర్, నంద్యాల సబ్ కలెక్టర్కు విన్నవిస్తున్నప్పటికీ వారు కూడా స్పందించడం లేదన్నారు. ఈనెల 26వ తేదీ తరువాత అన్ని రాజకీయ పార్టీలను, రైతు, ఇతర ప్రజాసంఘాలను కలుపుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.