హైదరాబాద్లో 28 వారాల శిశువు గుండెకు అరుదైన చికిత్స
ABN , First Publish Date - 2021-06-25T18:16:19+05:30 IST
28 వారాల పాపకు గుండెలో రంధ్రం (పీడీఏ) ఏర్పడి ఇబ్బందికరంగా మారడంతో ..
హైదరాబాద్ సిటీ : 28 వారాల పాపకు గుండెలో రంధ్రం (పీడీఏ) ఏర్పడి ఇబ్బందికరంగా మారడంతో నాన్-ఇన్వేజివ్ క్లోజర్ పద్ధతిలో చికిత్స చేసినట్లు కిమ్స్ కడిల్స్ వైద్యులు తెలిపారు. చందానగర్కు చెందిన సాఫ్ట్వేర్ దంపతులు అనిత, రాకేష్ సింగ్కు ఏప్రిల్ 21న పాప పుట్టింది. ఆ చిన్నారి 28 వారాలకే జన్మించింది. ఆ సమయంలో కేవలం 1,100 గ్రాముల బరువే ఉంది. ఏడోనెల పుట్టిన పాప బతికే అవకాశాలు దాదాపు 80 నుంచి 90 శాతం మాత్రమే. మరోవైపు ఆ పాపకు పుట్టుకతోనే ‘పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్’ అనే సమస్య ఉంది. గుండె నుంచి వచ్చే రెండు ప్రధాన రక్తనాళాల మధ్య ఖాళీ ఉంది. పాప పుట్టినప్పుడు ఊపిరి ఆడకపోవడంతో వెంటనే ముక్కు ద్వారా సీపా్పనుతో ఆక్సిజన్ అందించినట్లు చీఫ్ నియోనాటాలజిస్టు డాక్టర్ సి.అపర్ణ తెలిపారు. పాప నోటి నుంచి గాలిగొట్టంలోకి ఒక ప్లాస్టిక్ ట్యూబ్ను అమర్చి, ఊపిరితిత్తులు విచ్చుకోవడానికి కొన్ని రకాల మందులు అందించినట్లు చెప్పారు.
ఈ క్రమంలో పుట్టిన 20వ రోజున ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుండడంతో మరోసారి పరీక్షించగా గుండె, కాలేయం పెద్దది కావడం వంటి సమస్యలు కనిపించాయని పీడియాట్రిక్ కార్డియాలజిస్టు డాక్టర్ సుదీప్ వర్మ చెప్పారు. శస్త్రచికిత్స చేయకుండా క్యాథ్ల్యాబ్లో ఒక పరికరాన్ని అమర్చినట్లు చెప్పారు. ఫ్లూరోస్కోపిక్ విజన్ సాయంతో తొడ దగ్గర నుంచి ఫెమోరల్ వీనస్ అనే రక్తనాళం తీసుకోవడం ద్వారా ‘పికోలో ఆంప్లాట్టర్ ఆక్యూలడర్’ను ఈ పరికరం వినియోగించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియతో శిశువు కోలుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయని వివరించారు. చాలా కేసులలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి పీడీఏను మూసేస్తారని, అతి చిన్న కేథటర్ణు రక్తనాళం ద్వారా పంపి, తర్వాత సర్జరీ లేకుండా ఖాళీని పూరించినట్లు తెలిపారు.