పారిపోయిన నిందితుడు...మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు
ABN , First Publish Date - 2020-10-17T22:21:06+05:30 IST
అత్యాచారం కేసులో నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారిపోయిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది....
ముంబై : అత్యాచారం కేసులో నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారిపోయిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది. ముంబై నగరంలోని వీపీరోడ్డు ప్రాంతానికి చెందిన గోపాల్ మాధవ్ ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారం చేశాడు. మహిళ అరుపులతో స్థానికులు గుమిగూడి కీచకుడైన గోపాల్ మాధవ్ ను పోలీసులకు పట్టించారు. నిందితుడైన గోపాల్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 452 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసుస్టేషనుకు తరలించగా అతనికి కడుపునొప్పి, గుండె నొప్పి ఉందని చెప్పడంతో వైద్య పరీక్ష కోసం సియాన్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ రాస్తుండగా, నిందితుడైన గోపాల్ తప్పించుకొని పారిపోయాడు. దీంతో పోలీసులు గాలించి నిందితుడైన గోపాల్ ను వీపీ రోడ్డు ప్రాంతంలో అరెస్టు చేశామని పోలీసు అధికారి సహాజీ షిండే చెప్పారు.