యువతిపై అత్యాచారయత్నం..?
ABN , First Publish Date - 2022-06-27T07:04:27+05:30 IST
చంద్రగిరి సమీపంలో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు పరుగులు తీశారు.
సోషల్ మీడియాలో వైరల్
పరుగులు తీసిన పోలీసులు
చంద్రగిరి, జూన్ 26: చంద్రగిరి సమీపంలో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు పరుగులు తీశారు. ఆదివారం రాత్రి తిరుపతి నుంచి చంద్రగిరి వైపు ఓ ఆటో ప్రయాణికులతో బయల్దేరిందట. కాలూరు వద్ద అందరూ దిగిపోయారట. ఓ యువతి మాత్రమే ఉండడంతో ఆటోడ్రైవర్ ఆటోను కాలూరు నుంచి ముక్కోటి వైపు మళ్లించి.. మరో ఇద్దరితో కలిసి అత్యాచారానికి యత్నించాడట. ఆమె వారినుంచి తప్పించుకుని అగస్త్యేశ్వరస్వామి ఆలయం చేరుకుందట. అక్కడినుంచి కుటుంబీకులు ఆమెను ఇంటికి తీసుకెళ్లినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గాలించారు. ముక్కోటి సమీపంలోని సెరికల్చర్ కార్యాలయం వద్ద ఓ ఆటో రోడ్డు పక్కన ఉండడాన్ని గుర్తించారు. ఆలయ సిబ్బందిని, భక్తులను విచారించారు.ఆటో చంద్రగిరి మండలం, పాతశానంబట్లకు చెందిన ఎస్.జయకుమార్ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. పాతశానంబట్లకు వెళ్లి విచారించగా జయకుమార్ అందుబాటులో లేడు. అయితే ఆటోను ఐదు నెలల క్రితమే ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లినట్లు జయకుమార్ కుటుంబీకులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.