యష్, శుభం సెంచరీలు
ABN , First Publish Date - 2022-06-25T10:20:30+05:30 IST
రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ యష్ దూబే (133), శుభం శర్మ (116) అద్భుత శతకాలతో అదరగొట్టారు.
ముంబైతో రంజీ ఫైనల్
భారీ ఆధిక్యం దిశగా ఎంపీ
తొలి ఇన్నింగ్స్ 368/3
బెంగళూరు: రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ యష్ దూబే (133), శుభం శర్మ (116) అద్భుత శతకాలతో అదరగొట్టారు. దీంతో ముంబైతో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఎంపీ జట్టు శుక్రవారం ఆట ముగిసేసరికి తమ తొలి ఇన్నింగ్స్లో 368/3 స్కోరు చేసింది. రజత్ పటీదార్ (67 బ్యాటింగ్), ఆదిత్య (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో ఏడు పరుగులు చేస్తే ఎంపీ జట్టు ఆధిక్యంలోకి వెళుతుంది. ఓవర్నైట్ స్కోరు 123/1తో మూడో రోజు మధ్యప్రదేశ్ మొదటి ఇన్నింగ్స్ను ఆరంభించగా.. పిచ్ నుంచి ముంబై బౌలర్లకు సహకారం లభించలేదు. దీంతో రోజంతా బౌలింగ్ చేసినా రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు.
ఇదే అదనుగా చెలరేగిన యష్, శుభం రెండో వికెట్కు 222 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత యష్తో కలిసి రజత్ పటీదార్ మూడో వికెట్కు 72 పరుగులు జత చేయడంతో జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇక నాలుగో రోజు ముంబై బౌలర్లు పుంజుకుని ప్రత్యర్థిని కట్టడి చేయకపోతే టైటిల్పై ఆశ వదులుకోవాల్సిందే. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 374 పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోర్లు:
ముంబై తొలి ఇన్నింగ్స్:
374 ఆలౌట్ (సర్ఫరాజ్ 134, యశస్వీ జైస్వాల్ 78, పృథ్వీ షా 47, గౌరవ్ 4/106, అనుభవ్ 3/81), మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 123 ఓవర్లలో 368/3 (యష్ దూబే 133, శుభం శర్మ 116, రజత్ 67 బ్యాటింగ్).