రాణా కపూర్‌ లండన్‌ ఫ్లాట్‌ జప్తు

ABN , First Publish Date - 2020-09-26T06:42:12+05:30 IST

యెస్‌ బ్యాంక్‌ ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్‌కు లండన్‌లో ఉన్న రూ.127 కోట్ల విలువైన ఫ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది...

రాణా కపూర్‌ లండన్‌ ఫ్లాట్‌ జప్తు

  • ఆస్తి విలువ రూ.127 కోట్లు 


న్యూఢిల్లీ: యెస్‌ బ్యాంక్‌ ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్‌కు లండన్‌లో ఉన్న రూ.127 కోట్ల విలువైన ఫ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. రాణా కపూర్‌పై మనీలాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఈ స్థిరాస్తిని జప్తు చేశారు. రాణా కపూర్‌ ఈ ఫ్లాట్‌ను 2017లో 99 లక్షల పౌండ్ల (రూ.93 కోట్లు)కు కొనుగోలు చేశారు. డీఓఐటీ క్రియేషన్స్‌ జెర్సీ లిమిటెడ్‌ అనే సంస్థ పేరిట కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీకి అసలు లబ్ధిదారు తనేనని ఈడీ పేర్కొంది. కపూర్‌ ఈ ఆస్తిని విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నాడని, ఇందుకోసం ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ను సైతం నియమించుకున్నట్లు ఈడీ వెల్లడించింది. 


కపూర్‌పై సెబీ కోటి జరిమానా: యెస్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓ, ఎండీ రాణా కపూర్‌పై క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’ రూ. కోటి జరిమానా విధించింది. గతంలో మోర్గాన్‌ క్రెడిట్‌ నిధుల సేకరణ కు సంబంధించిన వివరాలను స్టాక్‌ మార్కెట్లకు వెల్లడించనందుకు గాను ఈ పెనాల్టీ విధించింది. 

Updated Date - 2020-09-26T06:42:12+05:30 IST