రంజాన్ ఎఫెక్ట్.. రూ.69 కోట్లకు మేకలు, పొట్టేళ్ల అమ్మకం
ABN , First Publish Date - 2022-05-01T15:17:00+05:30 IST
రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రమంతటా రూ.69 కోట్ల మేరకు మేకలు, పొట్టేళ్ల అమ్మకాలు జరుగనున్నాయని వ్యాపారుల సంఘం నాయకులు తెలిపారు. నాలుగు రోజులుగా
చెన్నై: రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రమంతటా రూ.69 కోట్ల మేరకు మేకలు, పొట్టేళ్ల అమ్మకాలు జరుగనున్నాయని వ్యాపారుల సంఘం నాయకులు తెలిపారు. నాలుగు రోజులుగా రాష్ట్రంలోని ప్రధాన సంతల్లో రోజుకు కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ మేకలు, పొట్టేళ్లు అమ్ముడవుతున్నాయని, ఇదే విధంగా కొనసాగితే ఈ రంజాన్లో అమ్మకాలు సరికొత్త రికార్డును సృష్టించనున్నాయని, సుమారు రూ.69 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు. రెండేళ్ల కరోనా లాక్డౌన్ తర్వాత ముస్లింలు ఈ ఏడాది రంజాన్ను ఘనంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ పండుగ దినాల్లో మేకలు, పొట్టేళ్ళ అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఆ మేరకు వారం రోజులుగా విల్లుపురం జిల్లా సెంజి, మదురై జిల్లా తిరుమంగళం, సేలం జిల్లా చిన్న తిరుపతి, కొంగనాపరం, నామక్కల్ జిల్లా మొట్టాలా, తిరునల్వేలి జిల్లా మేల్పాళయం, ఎట్టయాపురం, దిండుగల్ జిల్లా ఒట్టన్సత్తిరం, తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి, కృష్ణగిరి జిల్లా కుందరాపళ్ళి వారపు సంతల్లో మేకలు, పొట్టేళ్ళ అమ్మకాలు ఊపందుకున్నాయి. సెంజి వారపు సంతలో ఒకే రోజులో రూ.4 కోట్ల విలువైన మేకలను విక్రయించారు. సేలం జిల్లా వారపు సంతల్లో రూ.10 కోట్ల విలువైన మేకలు, పొట్టేళ్ళను విక్రయించారు. ఒట్టన్సత్తిరంలో శుక్రవారపు సంతలో కోటి రూపాయల విలువైన మేకలను విక్రయించారు. ఇదేవిధంగా అమ్మకాలు కొనసాగితే వచ్చే మూడు రోజుల్లో అమ్మకాలు రూ.69 కోట్లకు పెరుగుతాయని వ్యాపార సంఘం నాయకులు చెబుతున్నారు.