రంజాన్ మాసంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి..
ABN , First Publish Date - 2021-04-13T06:17:25+05:30 IST
పవిత్ర రంజాన్ మాసంలో జరిగే ప్రార్థనలకు సంబంధించి కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖాధికారి పీఎస్ ప్రభాకరరావు తెలిపారు.
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), ఏప్రిల్ 12: పవిత్ర రంజాన్ మాసంలో జరిగే ప్రార్థనలకు సంబంధించి కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖాధికారి పీఎస్ ప్రభాకరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలోని అన్ని వక్ఫ్ సంస్థలు (మశీదు, ఈద్గా, దర్గా) మేనేజ్మెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వక్ఫ్ బోర్డు సూచనలు జారీ చేసిందన్నారు. ప్రతి మశీదు, దర్గా, ఈద్గా ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద శానిటైజర్ను విధిగా ఏర్పాటు చేయాలన్నారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు గల వారిని మశీదులకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆలింగనం, కరచాలనం నిషేధించినట్లు చెప్పారు. ప్రార్థనలు పూర్తయిన వెంటనే మశీదు లోపల, వజు ఏరియా, టాయిలెట్స్ను శానిటైజర్, ఫినాయిల్తో శుభ్రం చేయించాలన్నారు. మాస్కులను విఽధిగా ధరించాలని, ఎవరి జానిమాజును వారే తెచ్చుకోవాలని తెలిపారు. భౌతికదూరం పాటిస్తూ నమాజు, తరాబీ, సహరి, ఇఫ్తార్ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించుకోవాలన్నారు. పార్కింగ్ ఏరియాల వద్ద గుమిగూడకుండా భౌతికదూరం పాటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, కొవిడ్ నియమాలను పాటిస్తూ జిల్లాలోని ముస్లింలందరూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.